భారత్‌కు కొనసాగుతున్న అమెరికా సాయం !

ABN , First Publish Date - 2021-05-04T16:02:08+05:30 IST

మహమ్మారి కరోనాతో అల్లాడుతున్న భారత్‌ను ఆదుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా సాయం కొనసాగుతోంది.

భారత్‌కు కొనసాగుతున్న అమెరికా సాయం !

అమెరికా నుంచి భారత్ చేరిన 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాతో అల్లాడుతున్న భారత్‌ను ఆదుకునే దిశగా అగ్రరాజ్యం అమెరికా సాయం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు దఫాల్లో కీలక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు భారత్‌కు పంపించిన జో బైడెన్ సర్కార్.. తాజాగా మరో 545 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. మంగళవారం ప్రత్యేక మిలిటరీ విమానంలో ఇవి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూఎస్ సహాయానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరికొన్ని కోవిడ్ వైద్య సామాగ్రితో కూడిన మరో రెండు విమానాలు బుధవారం నాటికి భారత్‌కు చేరుకుంటాయని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. నిర్వహణ సమస్యల కారణంగా ఈ రెండు విమానాలు ఆలస్యమైనట్లు యూఎస్ రవాణా కమాండ్ సోమవారం తెలియజేసింది. ఇక ఆదివారం అమెరికా నుంచి 1.25 లక్షల రెమ్‌డెసివర్ వయల్స్‌తో ఓ విమానం భారత్‌కు వచ్చింది. అలాగే శనివారం 1000 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్య పరికరాలతో మరో విమానం భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్‌కు అత్యవసర వైద్య సాయంగా అగ్రరాజ్యం 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఐదు దఫాలలో కీలకమైన వైద్య సామాగ్రిని భారత్‌కు చేర్చింది.      

Updated Date - 2021-05-04T16:02:08+05:30 IST