ఎలుకల బారిన శిశువు మృతదేహం... విచారణకు అధికారి ఆదేశం!

ABN , First Publish Date - 2020-11-26T15:31:10+05:30 IST

యూపీలోని అలీగఢ్‌లోగల ఒక ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో...

ఎలుకల బారిన శిశువు మృతదేహం... విచారణకు అధికారి ఆదేశం!

అలీగఢ్: యూపీలోని అలీగఢ్‌లోగల ఒక ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో ఒక మహిళకు డెలివరీ చేశారు. ఆ శిశువు కొద్దిసేపటికే మృతిచెందింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆ మృతశిశువును ఆసుపత్రిలోని డీప్ ఫ్రిజర్‌లో ఉంచారు. అయితే మర్నాడు ఉదయం ఆ శిశువును ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఆ శిశువు మృతదేహంలోని కొన్ని భాగాలను ఎలుకలు కొరికి తినేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతవైద్యాధికారులు సదరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే అలీగఢ్‌కు చెందిన రాజేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన భార్య దేవిని నవంబరు 22న కీర్తి ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేశానని, అదే రోజు రాత్రి 11 గంటలకు ఆమె ఆడపిల్లకు జన్మినిచ్చిందని తెలిపారు.


తరువాత ఆ శిశువు మృతిచెందడంతో తమకు చూపించి, తిరిగి వారు తీసుకు వెళ్లిపోయారని తెలిపారు. మర్నాడు తమకు ఆ శిశువు మృతదేహాన్ని అప్పగించారని, అయితే ఆ శిశువు మృతదేహన్ని ఎలుకలు కొరికివేసిన విషయాన్ని తాము గమనించామని తెలిపారు. ఈ విషయమై తాము ఆసుపత్రి సిబ్బందిని అడగగా, వారు నిరక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంఓ డాక్టర్ బీపీ సింగ్ మాట్లాడుతూ ఆ శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయా లేదా అనే దానిపై విచారణ చేపట్టనున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఈ విషయం తెలుస్తుందన్నారు.    


Updated Date - 2020-11-26T15:31:10+05:30 IST