ఫీవర్‌ సర్వే వేగిరం

ABN , First Publish Date - 2021-05-09T05:27:35+05:30 IST

ఫీవర్‌ సర్వే వేగిరం

ఫీవర్‌ సర్వే వేగిరం
ఆమనగల్లు మండలం కొలికిరాళ్ల తండాలో జ్వరసర్వే చేస్తున్న వైద్యసిబ్బంది

  • వడివడిగా కదులుతున్న బృందాలు
  • కుటుంబ వివరాల సేకరణ, లక్షణాలుంటే నమోదు
  • బాధితులకు అక్కడికక్కడే మందులు
  • వీలైతే హోం ఐసోలేషన్‌.. లేదంటే ప్రత్యేక సెంటర్లకు 
  • అత్యవసరమైతే ఆసుపత్రికి తరలింపు
  • బాధితులను గుర్తిస్తున్న బృందాలు
  • మరణాల రేటు తగ్గించేలా చర్యలు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌: రంగారెడ్డి జిల్లాలో ఇంటింటి ఫీవర్‌ సర్వే చురుగ్గా కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళుతున్నారు. కరోనా లక్షణాలున్న వారిని పరీక్షించి బాధితులను గుర్తిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 871 బృందాలు ఇల్లిల్లూ సందర్శించి సర్వే చేపడుతున్నారు. జ్వరం, పల్స్‌, ఇతర ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసి కొవిడ్‌ లక్షణాలుంటే వివరాలు నమోదు చేసుకుని అక్కడికక్కడే హోం ఐసో లేషన్‌ కిట్లు అందిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటిం చాలో, మందులు ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరణాల రేటు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం జిల్లాలో వైద్య సిబ్బంది 44,922 ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 1,028 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 365మందికి కిట్స్‌ అందించారు. మూడు రోజులుగా సర్వే ముమ్మరంగా సాగుతోంది.  

పకడ్బందీగా సర్వే: డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ 

జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే పకడ్బందీగా చేపడుతున్నాం. రోజుకు 40వేల నుంచి 50వేల ఇళ్లలో సర్వే జరుగుతుంది. అక్కడికక్కడే జ్వర బాధితులకు మందులు అందిస్తున్నాము. రోజుకు వేయి కిట్ల వరకు పంపిణీ చేస్తున్నాము. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని 108లో గాంఽధీ, టిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తున్నాము. త్వరలో సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - 2021-05-09T05:27:35+05:30 IST