నగరానికి పండగ శోభ
ABN , First Publish Date - 2021-10-19T05:24:41+05:30 IST
పైడితల్లమ్మ పండగలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా అన్ని కూడళ్లు రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న పైడితల్లిని దర్శించుకుని పులకించిపోయారు.
ఘనంగా తొలేళ్ల ఉత్సవం
పైడితల్లి ఆలయానికి భక్తుల తాకిడి
అంతటా సందడే సందడి
(ఆంధ్రజ్యోతి బృందం)
పైడితల్లమ్మ పండగలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా అన్ని కూడళ్లు రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న పైడితల్లిని దర్శించుకుని పులకించిపోయారు. జైజై పైడిమాంబ అంటూ మహిళలు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించు కున్నారు. పులివేషాలు, సాముగరిడీలతో కళాకారులు సందడి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగంతో పాటు దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఇక రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో పైడిమాంబ ఆలయంతో పాటు కోట, గంటస్తంభం తదితర ప్రాంతాలు మెరిసిపోయాయి. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.