ఒకటే రద్దీ
ABN , First Publish Date - 2022-10-03T05:58:37+05:30 IST
ఒకటే రద్దీ
కిక్కిరిసిన బస్టాండ్.. కిటకిటలాడిన రైల్వేస్టేషన్
సొంతూర్లకు వెళ్లే విద్యార్థులతో పెరిగిన ప్రయాణాలు
కళాశాలల వద్దకే ఆర్టీసీ బస్సులు
కొనసాగిన స్పెషల్ ఆపరేషన్
రద్దీగా నడిచిన స్పెషల్ రైళ్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా పండుగ ప్రయాణాలు పతాక స్థాయిలో జరుగుతున్నాయి. కళాశాలలకు అవుటింగ్ ఇవ్వటంతో విద్యార్థులు బస్టాండ్, రైల్వేస్టేషన్కు భారీగా చేరారు. విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు నేరుగా కళాశాలల వద్దకే ప్రత్యేక బస్సులు నడిపారు. కంట్రోలర్లు, ఆర్టీసీ సిబ్బందికి కళాశాలల వద్ద డ్యూటీలు వేశారు. కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్కి పీఎన్బీఎస్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తమ ప్రాంతాలకు వెళ్లారు. ఈసారి ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకపోవటం వల్ల విద్యార్థులు ఎక్కువగా ప్రయాణాలు సాగించారు. దీంతో ఆదివారం మొత్తం 100 స్పెషల్స్ నడిచాయి. రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు అత్యధిక సంఖ్యలో బస్సులు నడిచాయి. హైదరాబాద్ నుంచి కూడా బస్సులన్నీ హౌస్ఫుల్ అయ్యి వచ్చాయి. పండుగ ముందురోజు భారీగా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ అధికారులు డిమాండ్ను బట్టి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో రైల్వేస్టేషన్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్పెషల్స్ నడపటం, హాల్డింగ్ ఇవ్వటం వల్ల రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి.