ఎరువుపై నిఘా
ABN , First Publish Date - 2022-07-26T05:01:54+05:30 IST
ఖరీఫ్ సీజన్ మొదలై జిల్లావ్యాప్తంగా ఉబాలు ఊపందుకున్న నేపథ్యంలో ఎరువు కోసం రైతన్నలు యాతన పడుతున్నారు. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడకు పరుగు తీస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసేందుకు దళారులూ రంగంలోకి దిగుతున్నారు.
అధిక ధరలకు అమ్మితే ఊరుకోబోమంటున్న అధికారులు
టోల్ ఫ్రీ నెంబర్ 155251 ఏర్పాటు
ఖరీఫ్లో జిల్లాలో వరి పంట 90,811 హెక్టార్లు
జిల్లాకు 68వేల మెట్రిక్ టన్నుల అవసరం..
కవులు రైతులు 8.900 మంది
విజయనగరం(ఆంధ్రజ్యోతి), జూలై 25: ఖరీఫ్ సీజన్ మొదలై జిల్లావ్యాప్తంగా ఉబాలు ఊపందుకున్న నేపథ్యంలో ఎరువు కోసం రైతన్నలు యాతన పడుతున్నారు. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడకు పరుగు తీస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసేందుకు దళారులూ రంగంలోకి దిగుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఎరువుల అమ్మకాలపై నిఘా పెట్టారు. అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. కల్తీలు, అధిక ధరలకు విక్రయాలు చేపడ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం టోల్ఫ్రీ నంబర్ 15521ను కూడా ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి 90 వేల 811 హెక్టార్లలో వరిసాగు చేసేందుకు రైతులు సమాయత్తమ య్యరు. ఈ సీజన్కు 68 వేలమెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. యూరియా, డీఏపీ, పొటాష్తోపాటు వరి సాగుకు వినియోగించే 28-28, 1435-14 , 20-20-0, 15-15-14.50 వంటి ఇతర ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెలలో ఉపయోగించేందుకు 16,258 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా అడిగినంత ఎరువు దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు కౌలు రైతులు చాలా మందికి ఎరువు లభించడం లేదు. జిల్లాలో కౌలు రైతులు 8,900 మంది ఉండగా 3,800 మంది మాత్రమే రికార్డుల్లోకి ఎక్కారు. వీరికే సబ్సిడీపై ఎరువు లభ్యమవుతోంది. మిగతావారికి అందడం లేదు. కాగా ఆర్బీకేల్లో 4,831 మెట్రిక్ టన్నుల్లో నిల్వలున్నాయి. వీటిలో యూరియా 2,827.. డీఏపీ 1,828 మెట్రిక్ టన్నులుంది. ప్రయివేటు వ్యాపారుల వద్ద మరో 8,832 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు సమాచారం.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు కాకుండా ఎవరైన అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే టోల్ ఫ్రీ నెంబరు 155251 సమాచారం ఇవ్వొచ్చు. లేదంటే మండల వ్యవసాయ అధికారికి తెలియపరిచినా చాలు. వారు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రయివేట్ వ్యాపారుల గిడ్డంగులు, దుకాణాల్లో తనిఖీలు చేపట్టాం. అధికంగా ఎరువులు ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించాం. ప్రస్తుతానికి అన్ని రకాల ఎరువులు ఆర్బీకే, మార్కెఫెడ్, ప్రయివేటు వ్యాపారుల వద్ద ఉన్నాయి.
- వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
ఎరువుల ధరలు(బస్తా వద్ద)
యూరియా రూ.256
డీఏపీ రూ.1,350
పొటాష్ రూ.1,700
సూపర్ రూ.600
28-28రకం రూ.1,700
1435-14 రకం రూ.1,700
20-20-0రకం రూ.14,00
15-15రకం రూ.1,450