ఫిట్‌నెస్ పరీక్షల కోసం వెళ్తే.. మహిళా ఉద్యోగులను నగ్నంగా నిలబెట్టారు!

ABN , First Publish Date - 2020-02-22T02:52:10+05:30 IST

భుజ్‌లోని ఓ కళాశాలలో అమ్మాయిలు నెలసరిని దాచిపెట్టి భోజనశాలలోకి వస్తున్నారన్న..

ఫిట్‌నెస్ పరీక్షల కోసం వెళ్తే.. మహిళా ఉద్యోగులను నగ్నంగా నిలబెట్టారు!

సూరత్: భుజ్‌లోని ఓ కళాశాలలో అమ్మాయిలు నెలసరిని దాచిపెట్టి భోజనశాలలోకి వస్తున్నారన్న ఆరోపణలతో వారి లోదుస్తులు విప్పించి తనిఖీ చేసిన ఘటన ఇటీవల దేశంలో సంచలనం సృష్టించింది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే అటువంటిదే మరో ఘటన జరిగింది. సూరత్‌లోని మునిసిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ (ఎస్ఎంఐఎంఈఆర్)లో పరీక్షల కోసం వెళ్లిన పదిమంది సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మహిళా ట్రైనీ క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టారు. విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 


ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సూరత్ మునిసిపల్ కమిషనర్ బంచనిధి పాణీ శుక్రవారం దర్యాప్తునకు ఆదేశించారు. బాధితుల్లో పెళ్లికాని యువతులు కూడా ఉన్నారని, వారికి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారని ఎస్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన కమిషనర్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. 


ఎస్ఎంసీ నిబంధనల ప్రకారం.. ట్రైనీ ఉద్యోగులు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు ఫిజికల్ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరని అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న మహిళా ఉద్యోగుల్లో కొందరు మెడికల్ టెస్టుల కోసం గురువారం ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. టెస్టుల కోసం వెళ్లిన మహిళలను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి పరీక్షలు చేయాల్సిన మహిళా వైద్యులు.. అందరినీ ఒకేసారి పిలిచి నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీకి సంబంధించి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఇలా చేయడం పూర్తిగా చట్ట వ్యతిరేకమే కాకుండా అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూరత్ మేయర్ జగదీశ్ పటేల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-02-22T02:52:10+05:30 IST