కొడుకును హత్య చేయించిన తండ్రి! ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-07-29T15:57:25+05:30 IST

డబ్బు..డబ్బు..డబ్బు.. నిరంతరం డబ్బులు కావాలంటూ వేధింపులు, జులాయి తిరుగుళ్లు, అడిగినంత ఇవ్వకపోతే తల్లీతండ్రీ అని కూడా చూడకుండా వారిపై దాడులు. ఓ సందర్భంగా తల్లి చేయి కూడా అతడు విరిచేశాడు.. ఇవీ ఆ యువకుడి ఆగడాలు.

కొడుకును హత్య చేయించిన తండ్రి! ఎందుకో తెలిస్తే..

హపూర్: డబ్బు..డబ్బు..డబ్బు..  నిరంతరం డబ్బులు కావాలంటూ వేధింపులు, జల్సాలు, జులాయి తిరుగుళ్లు, అడిగినంత ఇవ్వకపోతే తల్లీతండ్రీ అని కూడా చూడకుండా వారిపై దాడులు. ఒకానొక సందర్భంలో అతడు తల్లి చేయి కూడా విరిచేశాడు.. ఇవీ ఆ యువకుడి ఆగడాలు. ఈ తీరుతో అతడి తండ్రి మనసు విరిగిపోయింది. జీవితం నరకప్రాయమైంది. కొడుకును పరలోకానికి పంపిస్తేగానీ మనస్సాంతి దొరకదని అతడు భావించాడు. ఆ తరువాత సుపారీ ఇచ్చి కన్న కొడుకుని హత్య చేయించేశాడు.

ఆ తండ్రి పేరు..కమల్ చంద్. కుమారుడు రిషభ్ ఘజియాబాద్ డిఫెన్స్ కాలనీలో నివశించేవాడు. కమల్ చంద్ హపూర్ ప్రాంతంలో ఆటోమోబైల్ షాప్ నిర్వహిస్తుంటాడు. అయితే కొడుకు ఆగడాలు భరించలేకపోయిన కమల్.. రిషభ్‌ను హత్య చేయాలంటూ పొరుగింట్లో ఉంటే కమల్ పాల్‌తో రూ. 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ డీల్‌కు ఓకే చెప్పిన పాల్..ఏకంగా రిషభ్ స్నేహితుడినే రంగంలో దింపాడు. ఓ రోజు మద్యం సేవిద్దామంటూ రిషభ్‌ను వారిద్దరూ శింభౌలీ ప్రాంతానికి తీసుకెళ్లారు. రిషభ్‌కు ఫుల్లుగా మద్యం తాగించి ఆ తరువాత గొంతు కోసి హత్య చేశారు. ఈ విషయాలను హపూర్ ఎస్పీ మీడియాతో పంచుకున్నారు.

‘నా కొడుకు పూర్తిగా కంట్రోల్ తప్పాడు. నన్నూ నా భార్యను అనకూడని మాటలు అనేవాడు. ఓ రోజు ఏకంగా నా భార్య చేయి కూడా విరగొట్టేశాడు. రిషభ్‌ను నేను డాక్టర్ వద్దకు తీసుకెళ్లా..చికిత్స చేయిస్తున్నా. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికీ తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు. మా జివితాలు నరకప్రాయమయ్యాయి. దీంతో మరో దారిలేకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ ఆ తండ్రి వాపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2020-07-29T15:57:25+05:30 IST