దాడులు, దౌర్జన్యాలకు భయపడం
ABN , First Publish Date - 2021-10-23T05:59:26+05:30 IST
దాడులు, దౌర్జన్యాలకు భయపడమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు
ఆదోని, అక్టోబరు 22: దాడులు, దౌర్జన్యాలకు భయపడమని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాల దాడిని నిరసిస్తూ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కోట్లాది ప్రజల నమ్మకం చూరగొన్నది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి చేయటం దుర్మార్గపు చర్యగా మీనాక్షినాయుడు అభివర్ణించారు. 35 ఏళ్లకు పైగా రాష్ట్ర భవిష్యత్కు, ప్రజల అభివృద్ధికి టీడీపీ పని చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చేసింది ఏమిలేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబునాయుడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అంధకారం తప్పా ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు మదిరె భాస్కర్రెడ్డి, దేవేంద్రప్ప, కల్లుబావి మల్లికార్జునతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీక్షకు హాజరయ్యారు.
చంద్రబాబు దీక్షకు సంఘీభావం
ఎమ్మిగనూరు: టీడీపీ కేంద్ర కార్యలయం, రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో టీడీపీ కార్యలయాలు, పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గం నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు అమరావతికి తరలివెళ్లి చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఆయా మండలాల నుంచి భారీగా తరలివెళ్లి చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు దీక్షకు కోట్ల సుజాతమ్మ మద్దతు
ఆలూరు: వైసీపీ ప్రభుత్వ దౌర్జన్య, ఉగ్రవాద చర్యలకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు ఆలూరు టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ మద్దతు ఇచ్చి ఆయనను పరామర్శించారు. వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు పోరాడతామని ఆంధ్రజ్యోతికి తెలిపారు.
కోసిగి: చంద్రబాబునాయుడి దీక్షకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తిక్కారెడ్డి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారని అన్నారు. వీరికి పోలీసులు కూడా వత్తాసు పలకడం బాధాకరమని పేర్కొన్నారు.