6,000 సంస్థల ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సులకు కాలం చెల్లింది!

ABN , First Publish Date - 2022-01-01T21:27:06+05:30 IST

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) క్రింద దాదాపు 6,000

6,000 సంస్థల ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సులకు కాలం చెల్లింది!

న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) క్రింద దాదాపు 6,000 సంస్థలకు మంజూరైన లైసెన్సుల కాల పరిమితి శనివారంతో ముగియబోతోంది. తమ లైసెన్సుల రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేయకపోవడం, ఒకవేళ దరఖాస్తు చేసినా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ దరఖాస్తును తిరస్కరించడం వల్ల ఈ సంస్థల లైసెన్సుల పునరుద్ధరణ జరగడం లేదు. ఈ సంస్థల జాబితాలో ఐఐటీ-ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, గ్రంథాలయం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ వుమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా కూడా ఉన్నాయి. ఎఫ్‌సీఆర్ఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పేర్కొన్నారు. 


ఎఫ్‌సీఆర్ఏ క్రింద నమోదైన ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీవోలు), అసోసియేట్ల కార్యకలాపాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ సంస్థల  రిజిస్ట్రేషన్లు జనవరి 1తో ముగిసినట్లు పరిగణిస్తామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. సంఘాలు, ఎన్‌జీవోలు విదేశీ విరాళాలను స్వీకరించాలంటే ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. శుక్రవారం వరకు ఈ రిజిస్టర్డ్ ఎన్‌జీవోలు 22,762 ఉండేవి, వీటిలో 5,933 ఎన్‌జీవోల లైసెన్సుల గడువు శనివారంతో ముగిసింది. 


Updated Date - 2022-01-01T21:27:06+05:30 IST