కలలో తండ్రి మృతిని చూసి...30 ఏళ్ల తరువాత ఇల్లు గుర్తుకొచ్చి...

ABN , First Publish Date - 2021-04-10T17:12:13+05:30 IST

30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు...

కలలో తండ్రి మృతిని చూసి...30 ఏళ్ల తరువాత ఇల్లు గుర్తుకొచ్చి...

జైన్‌పూర్: 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు ఊహించని రీతిలో ప్రత్యక్షమైతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరప్రదేశ్‌లోని జైన్‌పూర్‌ పరిధిలోగల పట్టీనరేంద్రపూర్ గ్రామంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అది 1991, నవంబరు 11 నాటి సంగతి. గ్రామానికి చెందిన మోహన్ ప్రసాద్ తివారి కుమారుడు కృష్ణాచంద్ తివారి(16) ఇంటిలో జరిగిన ఏదో విషయమై గొడవపడి, ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మోహన్ ప్రసాద్ దంపతులు కుమిలిపోయారు. ఆ సమయంలో మోహన్... రేడియోలు, టేప్ రికార్డర్లు రిపేర్ చేసేవాడు.


చాలాకాలం పాటు ఆ దంపతులు కుమారిని కోసం తీవ్రంగా గాలించారు. మరోవైపు కృష్ణాచంద్ తివారి ఇంటి నుంచి వెళ్లిపోయాక, ఢిల్లీ చేరుకుని చిన్నాచితకా పనులు చేసుకుంటూ, జీవనం సాగించాడు. అనంతరం సొంత ఇల్లు కట్టుకుని, వివాహం కూడా చేసుకున్నాడు. అలాగే వ్యాపారంలో కూడా స్థిరపడ్డాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే ఒకరోజు రాత్రి అతనికి తండ్రి చనిపోయినట్లు కల వచ్చింది. ఈ విషయాన్ని స్నేహితునికి చెప్పాడు. దీంతో అతను తన బంధువుల సాయంతో మోహన్ ప్రసాద్ తివారి దంపతులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. కుమారుని గురించిన వార్త తెలియగానే వారు ఉప్పొంగిపోయారు. మర్నాడు మోహన్ ఇంటి చుట్టుపక్కలగల వారు ఆ దంపతులను కారులో ఢిల్లీలోని కృష్ణా చంద్ ఇంటికి పంపించారు. అక్కడవారు కుమారుడిని కలుసుకున్నారు.

Updated Date - 2021-04-10T17:12:13+05:30 IST