ఆ కుర్రాడి ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియదు.. కొడుకు ఎటో వెళ్లిపోయాడని కంప్లైంట్ ఇచ్చాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-10T17:31:57+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో గల గోహడ్..

ఆ కుర్రాడి ప్రేమ వ్యవహారం తండ్రికి తెలియదు.. కొడుకు ఎటో వెళ్లిపోయాడని కంప్లైంట్ ఇచ్చాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో గల గోహడ్ ప్రాంతానికి చెందిన 12వ తరగతి కుర్రాడు గుర్గావ్‌కు చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆ యువతిని కలవాలనుకున్న ఈ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఇందుకోసం అతను ఒక యాప్ సాయంతో తన వాయిస్ ఛేంజ్ చేసి తన తండ్రికే ఫోన్ చేసి.. నీ కుమారుడిని కిడ్నాప్ చేశామని, మర్యాదగా రెండున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే కుర్రాడిని చంపేస్తామని బెదిరించాడు. పోలీసులు ఈ కేసును ఛేదించడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోహడ్ నివాసి సురేంద్ర నవంబరు 6న పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కుమారుడు సందీప్(18) ఇంటిలో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సందీప్ కోసం గాలింపు ప్రారంభించారు. 


ఇంతలో నవంబరు 8న సురేంద్ర తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కుమారుడిని కిడ్నాప్ చేశామంటూ ఫోను వచ్చిందని పోలీసులకు తెలిపారు. రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో చంపేస్తామంటున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ నంబరు ఆధారంగా లోకేషన్ కనుక్కొనే ప్రయత్నం చేశారు. అ ఫోన్ గ్వాలియర్ ప్రాంతం నుంచి వచ్చిందని తేలింది. దీంతో పోలీసుల బృందం గ్వాలియర్ చేరుకుంది. అక్కడ సందీప్‌ను వారు పట్టుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. సందీప్ పోలీసులతో మాట్లాడేందుకు తొలుత నిరాకరించాడు. తరువాత పోలీసులు అతనిని గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తానే కిడ్నాప్ డ్రామా ఆడానని వెల్లడించాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు తండ్రి నుంచి డబ్బులు రాబట్టాలని నాటకం ఆడానని తెలిపాడు. ఇంటి నుంచి మాయమైన సందీప్ నవంబరు 8న తండ్రికి వివిధ ఫోను నంబర్ల నుంచి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే పోలీసుల జోక్యంతో అతని బండారమంతా బయటపడింది. కాగా సందీప్ ఆ యువతిని ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాడు. గతంలో సందీప్ తన మేనత్త ఇంటికి వెళ్లినప్పుడు ఆ యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.



Updated Date - 2021-11-10T17:31:57+05:30 IST