తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన తనయుడు
ABN , First Publish Date - 2022-05-21T15:35:13+05:30 IST
వలసరవాక్కంలో తండ్రిని ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేసి పారిపోయిన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆస్తితగాదాల నేపథ్యంలో తండ్రిని ముక్కలుగా నరికి
- వలసరవాక్కంలో దారుణం
- శరీర భాగాలు డ్రమ్ములో కుక్కి పరారీ
అడయార్(చెన్నై): వలసరవాక్కంలో తండ్రిని ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేసి పారిపోయిన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆస్తితగాదాల నేపథ్యంలో తండ్రిని ముక్కలుగా నరికి శరీర భాగాలను ఓ డ్రమ్ము లో కుక్కి కావేరిపాక్కంలో పారవేయడం కలకలం సృష్టించింది. ఈ హత్య కేసు వివరాలు.. వలసరవాక్కం ఆర్కాడు రోడ్డులో నివసిస్తున్న కుమరేశన్ (80) అనే వృద్ధుడికి గుణశేఖరన్ (50)అనే కుమారుడు, కాంచనతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమరేశన్ తన కుమారుడి ఇంట్లోనే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి కనిపించడం లేదని కుమరేశన్ కుమార్తె కాంచన గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గుణశేఖరన్ ఇంటికి వెళ్ళి పరిశీలించగా, ఓ గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అదేసమయంలో గుణశేఖరన్ కనిపించకుండా పోయాడు. అయితే, ఇంట్లో ఎక్కడా మృతదేహం దాచిన ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో పోలీసులు కావేరిప్పాక్కంలో ఉన్న గుణశేఖరన్కు చెందిన స్థలంలో పరిశీలన జరిపారు. ఆ చోట డ్రమ్ములో కుమరేశన్ దేహపు భాగాలు పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. ఆ దేహపు భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల తండ్రి, కొడుకు మధ్య ఆస్తి విషయమై తగాదాలు నెలకొన్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈ హత్య చేసిన గుణశేఖరన్ పారిపోయాడని పోలీసులు తెలిపారు.