కరోనా కాటేసింది.. కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆ తండ్రి కూడా..

ABN , First Publish Date - 2020-08-07T16:07:39+05:30 IST

రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలను మాయదారి రోగం వారిని కష్టాల పాలు చేసింది. దొరికిన పని చేసుకొని బతుకు బండి ఈడ్చే వారి పాలిట కరోనా కొలిమిలా మారింది. చేతికి పని లేక.. జేబులో పైస లేక..

కరోనా కాటేసింది.. కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆ తండ్రి కూడా..

కరోనా వేళ.. ఆర్థిక ఇబ్బందులే కారణం! 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం 


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి): రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలను మాయదారి రోగం వారిని కష్టాల పాలు చేసింది. దొరికిన పని చేసుకొని బతుకు బండి ఈడ్చే వారి పాలిట కరోనా కొలిమిలా మారింది. చేతికి పని లేక.. జేబులో పైస లేక.. పోషణ భారంగా మారడంతో.. చివరకు కూతురికి విషమిచ్చి ఆపై తండ్రీ ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా విషాదం నింపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో అక్బర్‌ అలియాస్‌ ఆశీర్వాదం, భార్య లక్ష్మీ, కూతురు సైరా బేగం అలియాస్‌ సైరాలు నివాసం ఉంటున్నారు. వీరు బతుకుదె రువు నిమిత్తం కొన్నేళ్ల క్రితమే ఆంధ్ర నుంచి కామారెడ్డికి వచ్చారు. ఓ గుడారం లో నివాసం ఉంటూ వీధుల్లో మహిళలకు సంబంధించిన రబ్బర్‌బ్యాండ్స్‌, పిన్నీసులు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవారు.


అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం సాగక అక్బర్‌ కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో భార్య లక్ష్మీ.. భర్త, కూతురిని వదిలి తల్లిగారింటికి వెళ్లిపోగా.. అక్బర్‌ ఒంటరి వాడయ్యాడు. చేసే చిరు వ్యాపారం కొనసాగక ఆర్థికంగా చితికిపోవడం, తిండికీ తిప్పలు కావడంతో కుంగిపోయిన అక్బర్‌(42) తీవ్ర మనస్థాపం చెంది.. బుధవా రం అర్ధరాత్రి తన కూతురు సైరా(14)కు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. ఆ తర్వాత అదే గుడారంలో అతడూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం దేవునిపల్లి పోలీసులకు స్థానికులు సమాచా రం అందించగా.. కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వేళ స్థానికంగా ఉన్న చర్చి నిర్వాహకులు ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రీ కూతురి అంత్యక్రియలను నిర్వహించారు. 

Updated Date - 2020-08-07T16:07:39+05:30 IST