తండ్రికి కుమార్తె కాలేయం
ABN , First Publish Date - 2022-05-20T16:00:48+05:30 IST
స్థానిక వడపళనిలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో 63 యేళ్ళ వృద్ధుడికి కుమార్తె కాలేయంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వివేక్ విజ్ తెలిపారు. గురువారం ఉదయం
- ఫోర్టిస్ మలర్లో అరుదైన శస్త్ర చికిత్స
చెన్నై: స్థానిక వడపళనిలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో 63 యేళ్ళ వృద్ధుడికి కుమార్తె కాలేయంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వివేక్ విజ్ తెలిపారు. గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ తమ ఆస్పత్రుల్లో 2500లకుపైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, అయితే కుమార్తె దానం గా ఇచ్చిన కాలేయంతో తండ్రికి అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం తమకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ స్వాతి రాజు మాట్లాడుతూ కాలేయం దెబ్బతినటంతో ఆరుమాసాలుగా తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుడు తమ ఆస్పత్రిలో చేరినప్పుడు తక్షణమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ సమయంలో మెదడు నిర్జీవమైనవారి నుంచి కాలేయం అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువుల నుంచి దానంగా తీసుకోవాలని భావించామని చెప్పారు. ఆ వృద్ధుడి ఇద్దరి కుమార్తెలకు పరీక్షలు చేసి, చిన్న కుమార్తె నుంచి దానంగా స్వీకరించిన కాలేయంతో తండ్రికి అవయవమార్పిడి శస్త్రచికిత్స చేసినట్టు ఆమె తెలిపారు. 18 నుంచి 50 యేళ్ళలోపువారు కాలేయంలో కొంత భాగం దానం చేసిన ఆరు వారాల్లో కాలేయభాగం మళ్ళీ పెరుగుతుందని, ప్రస్తుతం ఇద్దరూ సంపూర్ణంగా కోలుకున్నారని తెలిపారు. మీడియా సమావేశం లో వైద్యనిపుణులు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ తనూజ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పూర్ణచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.