వేగంగా ఆర్థిక రికవరీ
ABN , First Publish Date - 2020-11-27T06:37:18+05:30 IST
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అత్యంత ఆశాభావంతో ఉంది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఊహించిన దానికంటే బలంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఫారిన్ ఎక్సేంజ్ డీలర్స్
ఇంకా ముప్పు పొంచి ఉంది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అత్యంత ఆశాభావంతో ఉంది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఊహించిన దానికంటే బలంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఫారిన్ ఎక్సేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫెడాయ్) వార్షిక సమావేశంలో దాస్ ఈ విషయం చెప్పారు. కేంద్ర గణాంక సంస్థ (సీఎ్సఓ) శుక్రవారం రెండో త్రైమాసిక జీడీపీ వివరాలు విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ముప్పుంది జాగ్రత్త : ప్రస్తుతం జీడీపీ వృద్ధి రేటు పుంజుకున్నా, మలి విడత కొవిడ్ ముప్పు పొంచే ఉందని దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ కట్టడి కోసం కొన్ని యూరప్ దేశాల్లో మళ్లీ లాక్డౌన్లు విధించడం కూడా భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. పండగల సీజన్ తర్వాత ఇప్పుడున్న డిమాండ్ కొనసాగుతుందా? లేదా? అనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉందన్నారు.
మూలధన ఖాతా మార్పిడి : మూలధన ఖాతా (క్యాపిటల్ అకౌంట్) మార్పిడిపైనా దాస్ మాట్లాడారు. భారత్కు సంబంధించినంత వరకు అది ఒక ప్రక్రియే తప్ప సంఘటన కాదన్నారు. ఈ మాటల ద్వారా పూర్తి స్థాయి మూలధన ఖాతా మార్పిడిని అనుమతించేది లేదని పరోక్షంగా చెప్పారు. ఎలాంటి పరిమితులు లేకుండా దేశంలోకి పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడం, తీసుకుపోవడాన్ని మూలధన ఖాతా మార్పిడి అంటారు.