విషవాయువు పీల్చి.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య!

ABN , First Publish Date - 2022-06-12T09:05:53+05:30 IST

శ్రుతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా ఎంతో మంది సినీతారలకు అందమైన దుస్తులను రూపొందించిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌

విషవాయువు పీల్చి.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య!

శ్రుతి హాసన్‌, రకుల్‌, సానియా సహా ఎంతోమంది స్టార్లకు దుస్తులు డిజైన్‌ 


బంజారాహిల్స్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): శ్రుతి హసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా ఎంతో మంది సినీతారలకు అందమైన దుస్తులను రూపొందించిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష(36). ఆత్మహత్యకు పాల్పడ్డారు.  బొగ్గుల కుంపటిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ద్రావణం పోసి.. దాన్నుంచి వచ్చిన విషవాయువును పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర ఒత్తిడితోనే ఆమె బలవన్మరణానికి పాల్పడివుంటారని  అనుమానిస్తున్నారు. ప్రత్యూష స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఆమె వద్ద దుస్తులు డిజైనింగ్‌ చేసుకున్న ప్రముఖుల్లో సినీతారలు పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్‌, కాజోల్‌ దేవగన్‌, విద్యాబాలన్‌, రవీనాటాండన్‌, నేహా దూపియా, జుహీ చావ్లా, కృతి కర్బందా, క్రీడాకారిణి సానియా మీర్జా వంటి ఎంతో మంది ఉన్నారు. ఈ ఏడాదే హైదరాబాద్‌ వచ్చిన  ప్రత్యూష  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో బొటిక్‌ ఏర్పాటు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం తాను బొటిక్‌ సెంటర్‌కు వెళుతున్నట్లు తల్లికి చెప్పి బయలుదేరారు.  సాయంత్రం ప్రత్యూషతో మాట్లాడదామని ఆమె తల్లి పలుమార్లు ఫోన్‌ చేయగా కలవలేదు. శనివారం ఉదయం కూడా ఫోన్‌ కలవకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ప్రత్యూష గురించి ఆమె స్నేహితుల వద్ద ఆరా తీయగా తమ వద్దకు రాలేదని చెప్పారు. అందరూ కలిసి బొటిక్‌ కేంద్రానికి వెళ్లి వాచ్‌మన్‌ను అడిగారు. రాత్రి నుంచి ఆమె లోపలే పడుకొని ఉన్నారని వాచ్‌మన్‌ చెప్పాడు. అనంతరం వారు తలుపులు పగులకొట్టి చూడగా.. బాత్‌రూం తలుపు తెరవగానే లోపలి నుంచి ఒక్కసారిగా విషవాయువు వెలువడింది. బంధువులు, స్నేహితులు ఉక్కిరిబిక్కిరై బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి మళ్లీ వెళ్లి చూడగా బాత్‌రూంలోనే ప్రత్యూష విగతజీవిగా పడి ఉన్నారు.  ఘటనాస్థలి నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ ద్రావణం డబ్బాను, టేబుల్‌పై సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-06-12T09:05:53+05:30 IST