‘ఫామ్‌హౌస్‌’ పాలిటిక్స్‌!

ABN , First Publish Date - 2020-07-12T05:50:56+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. అవి రాజకీయపరమైనవి అయినా, పాలనాపరమైనవి అయినా అలాగే ఉంటాయి. మన దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన తొలి దశలో...

‘ఫామ్‌హౌస్‌’ పాలిటిక్స్‌!

కరోనా వైరస్‌తో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతుంటే సచివాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లుతుంది. ఫామ్‌ హౌస్‌కు పరిమితం కావడానికి ముందు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని హడావిడి చేశారు. ఇదే కేసీఆర్‌ ఒకప్పుడు పీవీని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ చేయనందునే, ఆయన అంతిమయాత్రలో అపశ్రుతులు దొర్లాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీవీ మన ఠీవీ అంటూ పొగడడం మొదలెట్టారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దశలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి కరోనా సోకాలని శపించిన పెద్దమనిషి ఇప్పుడు అదే కరోనాకు భయపడి శనివారం దాకా ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, ప్రారంభంలో మినహాయించి సచివాలయం ముఖం చూడలేదు. ఇప్పుడు అదే కేసీఆర్‌ అద్భుతమైన సచివాలయాన్ని కడతానని చెబుతున్నారు.


లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అంటూ తనవంతుగా పలు ఉచిత సలహాలు ఇచ్చిన కేసీఆర్‌... కేంద్ర ప్రభుత్వం తన సూచనలను పట్టించుకోకపోవడంతో తన మంత్రులతో తిట్టించడం మొదలుపెట్టారు. ‘హెలికాప్టర్‌ మనీ’ అంటూ తాను చేసిన సూచనను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టడం కేసీఆర్‌కు నచ్చినట్టు లేదు. కేంద్రం కరెన్సీ నోట్లను ముద్రించి ఉదారంగా రాష్ర్టాలకు పంచితే ఆ డబ్బు తాను పేదలకు పంచి దేవుడనిపించుకోవాలని కేసీఆర్‌ భావించారట! ఇవేవీ జరగకపోవడంతో కేంద్రాన్ని తిట్టిపోయడం మొదలుపెట్టారు.  దీనితో బీజేపీ నాయకులు కూడా తమ వ్యూహాలను మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నది ఒక్కటే! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం అరడజను లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర నాయకులు దూకుడు పెంచారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. అవి రాజకీయపరమైనవి అయినా, పాలనాపరమైనవి అయినా అలాగే ఉంటాయి. మన దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన తొలి దశలో, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికై ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించి, సుదీర్ఘ సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌... వైరస్‌ విజృంభించడంతో దాన్నొక సమస్యగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. దాదాపు రెండు వారాలు ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ సచివాలయ భవనాలను కూల్చడానికి అర్ధరాత్రి ముహూర్తం నిర్ణయించారు. అంతటితో ఆగకుండా కూల్చివేతలు సజావుగా పూర్తిచేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డికి అప్పగించారు. దీంతో ఈ అత్యున్నతస్థాయి అధికారులు ఇరువురూ మూడు రోజులుగా రాష్ట్రంలో మరే పనులూ లేనట్టుగా సచివాలయ కూల్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్‌తో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతుంటే సచివాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం కేసీఆర్‌కు మాత్రమే చెల్లుతుంది. ఫామ్‌ హౌస్‌కు పరిమితం కావడానికి ముందు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని హడావిడి చేశారు. ఇదే కేసీఆర్‌ ఒకప్పుడు పీవీని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ చేయనందునే, ఆయన అంతిమయాత్రలో అపశ్రుతులు దొర్లాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీవీ మన ఠీవీ అంటూ పొగడడం మొదలెట్టారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దశలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి కరోనా సోకాలని శపించిన పెద్దమనిషి ఇప్పుడు అదే కరోనాకు భయపడి శనివారం దాకా ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, ప్రారంభంలో మినహాయించి సచివాలయం ముఖం చూడలేదు. ఇప్పుడు అదే కేసీఆర్‌ అద్భుతమైన సచివాలయాన్ని కడతానని చెబుతున్నారు. సామాన్య ప్రజలకు దర్శనం కూడా ఇవ్వకుండా ప్రగతి భవన్‌కే పరిమితమైన ఆయన తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయనలో అటువంటి అతి విశ్వాసం ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో కేసీఆర్‌కు చెక్‌ పెట్టేవాళ్లు లేకుండాపోయారు. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు చేతులు కలిపే అవకాశం ఏమాత్రం లేనందున తన అధికారానికి ఢోకా లేదన్న ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నట్టున్నారు. అయితే... రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2022 ప్రథమార్థంలో జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో బీజేపీ తన దృష్టిని మరింత కేంద్రీకరించవచ్చు. బహుశా ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్‌ ఆ పార్టీతో తలపడడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి కేసీఆర్‌తో జతకట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని బీజేపీ భావించింది. బీజేపీ ముఖ్య నాయకుడొకరు ఒకటికి రెండు పర్యాయాలు కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తమ పార్టీకి కనీసం మూడు సీట్లు కేటాయించాలని కోరారు. అయితే కేసీఆర్‌ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో బీజేపీ సొంతంగా పోటీ చేసి అనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి బీజేపీ పెద్దల్లో తెలంగాణపై ఆశలు చిగురించాయి. 


కేసీఆర్‌ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. కనుక వచ్చే ఎన్నికలనాటికి సొంత బలాన్నే నమ్ముకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇలాంటి ఎత్తుగడలను పసిగట్టే నైపుణ్యం దండిగా ఉన్న కేసీఆర్‌ అప్పుడప్పుడు బీజేపీ ఢిల్లీ పెద్దలతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర నాయకులను అయోమయానికి గురి చేస్తుంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలను కలిసి కేసీఆర్‌ విషయంలో పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని పలుమార్లు కోరారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తొలి రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ప్రకటించడంతోపాటు ఆయనను అదే పనిగా పొగిడిన కేసీఆర్‌ ఇప్పుడు అదే పనిగా తిడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అంటూ తనవంతుగా పలు ఉచిత సలహాలు ఇచ్చిన కేసీఆర్‌... కేంద్ర ప్రభుత్వం తన సూచనలను పట్టించుకోకపోవడంతో తన మంత్రులతో తిట్టించడం మొదలుపెట్టారు. ‘హెలికాప్టర్‌ మనీ’ అంటూ తాను చేసిన సూచనను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టడం కేసీఆర్‌కు నచ్చినట్టు లేదు. కేంద్రం కరెన్సీ నోట్లను ముద్రించి ఉదారంగా రాష్ర్టాలకు పంచితే ఆ డబ్బు తాను పేదలకు పంచి దేవుడనిపించుకోవాలని కేసీఆర్‌ భావించారట! ఇవేవీ జరగకపోవడంతో కేంద్రాన్ని తిట్టిపోయడం మొదలుపెట్టారు. మంత్రివర్గ సమావేశాల్లో కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. దీనితో బీజేపీ నాయకులు కూడా తమ వ్యూహాలను మార్చుకున్నారు. కరోనాను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసమంటూ కేంద్ర బృందాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రప్పించారు. అదే సమయంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తన వంతుపాత్ర పోషించడం మొదలుపెట్టారు. తొలుత నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్‌, ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. అయితే అక్కడికి ‘వద్దు’ అని వైద్యులు సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. హైదరాబాద్‌లో వైరస్‌ విజృంభించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖ కార్యదర్శిని తన వద్దకు రావాలని గవర్నర్‌ ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను మొదటి రోజు పాటించని ఆ ఇద్దరు అధికారులు మరుసటి రోజు గవర్నర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అలా చేసి ఉంటారు. తెలంగాణలో చీమ చిటుక్కుమనాలన్నా కేసీఆర్‌ అనుమతి అవసరం కదా! ప్రభుత్వ అధికారులను గవర్నర్‌ నేరుగా పిలిపించుకోవడంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రులకు తెలియజేసిన తర్వాత అధికారులను పిలిపించుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, రాజకీయ కారణాలవల్ల గవర్నర్లు కొన్ని సందర్భాల్లో మౌనంగా మరికొన్ని సందర్భాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కాదని గవర్నర్‌ అధికారం చలాయించడాన్ని సహజంగానే హర్షించరు. మొత్తానికి గవర్నర్‌ తమిళిసై నిర్ణయంతో బీజేపీ–టీఆర్‌ఎస్‌ మధ్య ప్రత్యక్షపోరుకు తెరతీసినట్టయింది. బీజేపీ నాయకుల మాటలలో పదును పెరగగా, అధికార పార్టీవాళ్లు కూడా అదే స్థాయిలో ఎదురుదాడి మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నది ఒక్కటే! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం అరడజను లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే బీజేపీ రాష్ట్ర నాయకులు దూకుడు పెంచారు.


మసకబారుతున్న ప్రతిష్ఠ పాలనా పరమైన విషయాల్లో కేసీఆర్‌ వైఖరి వివాదాస్పదంగా ఉంటున్నప్పటికీ, రాజకీయపరమైన అంశాలలో మాత్రం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు తన చతురత ప్రదర్శించడాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ ఒక్క పార్టీ కూడా మరీ బలపడకుండా ఎత్తుగడలు అమలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాల మధ్య నెలకొన్న సవతి పోరు కేసీఆర్‌కు బాగా కలిసొస్తోంది. అయితే, గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రతిష్ఠ మసకబారుతోంది. కరోనా బారినపడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఫామ్‌హౌస్‌లో క్వారంటైన్‌ విధించుకున్న కేసీఆర్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్టుగా సచివాలయం కూల్చివేయడాన్ని సమాజం జీర్ణించుకోలేకపోతోంది. కరోనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్‌ ఈ కూల్చివేత నిర్ణయం తీసుకుని ఉండవచ్చుగాని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూనే, భారీ బడ్జెట్‌తో కొత్త సచివాలయాన్ని కట్టించాలనుకోవడాన్ని మాత్రం ప్రజలు హర్షించడం లేదు. రెండు వారాలపాటు ప్రజలకు కనపడకుండా, వినపడకుండా ఫామ్‌హౌస్‌లో గడిపిన వైనం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన ఆరోగ్యంపై వదంతులు షికార్లు చేశాయి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా తన భద్రత తాను చూసుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి. ప్రగతి భవన్‌లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందికి కరోనా సోకడంతో కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో గడిపారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కనబడని లోటును భర్తీ చేయడానికి ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్‌ శక్తివంచన లేకుండా కృషి చేశారు. కరోనాను లెక్క చేయకుండా ఆయన సమీక్షలు, సమావేశాలతో తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తాను తప్పుకొని కేటీఆర్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టాలి అని కేసీఆర్‌ చాలాకాలంగా యోచిస్తున్నారు. అయితే, సరైన ముహూర్తం కుదరకపోవడం వల్లగాని, మరో కారణం వల్లగానీ పట్టాభిషేకం జరగలేదు. ఇప్పుడు కేసీఆర్‌ సుదీర్ఘకాలం ఫామ్‌హౌస్‌లోనే గడుపుతున్నందున తనకు బదులు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చుకదా... అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. ప్రజల నుంచి అలాంటి డిమాండ్‌ రావాలని కేసీఆర్‌ కూడా కోరుకుంటున్నారేమో తెలియదు. అందుకోసమే రెండు వారాలు ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమై ఉండవచ్చు కూడా! కేసీఆర్‌ ఆలోచనలు, చర్యలు ఇలాగే అనూహ్యంగా ఉంటాయి మరి!


ఏపీలో ‘దండు’ యాత్ర

ఈ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయాలు మారుతున్నాయి. అధికార వైసీపీని విమర్శించే విషయంలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ నాయకులు తాజాగా ట్వీట్ల యుద్ధానికి తెరతీశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను నిశితంగా విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ట్వీట్‌ చేసినా పెద్దగా పట్టించుకోని బీజేపీ నాయకులు తాజాగా విజయ సాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీనిబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి–బీజేపీ మధ్య పూర్తిగా చెడిపోయిందని భావించడానికి వీల్లేదు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారితో రాష్ట్రంలో బలపడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి చేరిన సుజనా చౌదరి ప్రభృతులను విజయసాయిరెడ్డి మిడతల దండుతో పోల్చడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీలోకి వచ్చేవారిని ఇలా కించపరచడాన్ని కట్టడి చేయకపోతే పార్టీలో చేరడానికి ఇతరులు ఆసక్తి చూపకపోవచ్చన్నది బీజేపీ నాయకుల అభిప్రాయంగా చెబుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా పార్టీ పంపిన నిధులను లోక్‌సభకు పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి దుర్వినియోగం చేశారని గతంలో విజయసాయి రెడ్డి విమర్శించినా పట్టించుకోని బీజేపీ నాయకులు ఇప్పుడు మాత్రం తమ పార్టీ అంతర్గత విషయంలో తలదూర్చితే సహించబోమంటూ విజయసాయిరెడ్డికి హెచ్చరిక చేయడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుంటారని బీజేపీలోని ఒక వర్గం ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తోంది. ఆ ఫిర్యాదులను పార్టీ అగ్రనాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు సునీల్‌ దేవధర్‌లాంటి వాళ్లు కూడా విజయ సాయిరెడ్డిపై ట్విటర్‌ వేదికగా దాడి చేసినవారిలో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా బలపడాలని బీజేపీ నాయకులు చాలా కాలంగా కలలు కంటున్నారు. అయితే, బీజేపీలోని కొంతమంది నాయకుల వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో పార్టీ పెద్దగా బలపడలేదు. రాజధాని అమరావతి విషయమే తీసుకుందాం! రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం జోక్యం చేసుకోలేదని సునీల్‌ దేవధర్‌, జీవీఎల్‌ నరసింహారావు వంటి వారు చేస్తున్న ప్రకటనల వల్ల బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడటం లేదు. నిజానికి వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అందుకు పార్టీ కట్టుబడి ఉంటుందని చెబితే సరిపోతుంది. కేంద్ర మంత్రులు చెప్పాల్సిన మాటలను పార్టీ నాయకులు చెప్పడం వల్ల తంటా అంతా వస్తోంది. ఇలాంటి పరిణామాలను నిశితంగా గమనిస్తే ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలకు, ముఖ్యమంత్రి జగన్‌ అండ్‌ కోకు మధ్య బయటకు కనబడని అవగాహన ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


టీడీపీ టార్గెట్‌...

రాష్ట్రంలో సొంతంగా బలపడాలని నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు బలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులపై వారికి నమ్మకం కలగడం లేదు. ఈ కారణంగానే జగన్‌ రెడ్డి అవసరానికి పనికొస్తారు అన్న ఉద్దేశంతో, ఆయన పట్ల మోదీ, షా కొంత ఉదారంగా ఉన్నారని చెబుతున్నారు. పైస్థాయిలో అవగాహన ఉన్నందునే తమ పార్టీపై విజయ సాయిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా చూసీ చూడనట్టు పోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తాము దూకుడు పెంచితే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లాభపడుతుందన్న ఉద్దేశంతో తాము సంయమనం ప్రదర్శిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు చెప్పుకొచ్చారు. ఎన్నికలనాటికి సొంతంగా బలపడలేని పక్షంలో మళ్లీ తెలుగుదేశంతో జతకట్టాల్సి రావచ్చునని, తమ పార్టీలోకూడా కొంత మంది అదే కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వ్యవహార శైలిని గమనించాక ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు కూడా చంద్రబాబు విషయంలో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితి మాత్రంలేదు. జగన్‌ బలహీనపడి, చంద్రబాబు బలపడినట్టు స్పష్టమైనప్పుడు మాత్రమే పునఃకలయిక గురించి ఆలోచిస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యుడొకరు చెప్పారు. నిజానికి విజయ సాయిరెడ్డిని కట్టడి చేయడం బీజేపీ పెద్దలకు చిటికెలో పని. ఢిల్లీ పెద్దలు గీసిన గీటును జగన్‌ రెడ్డి కూడా దాటే ప్రయత్నం చేయలేని పరిస్థితి ఉంది. అయినా, తమ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విజయ సాయిరెడ్డిని కట్టడి చేయడం లేదంటే బీజేపీ పెద్దల మనసులో ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. మరోవైపు జగన్‌కు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా విజయ సాయివంటి వాళ్లు బీజేపీని విమర్శించలేరు అన్నది అందరికీ తెలిసిందే. ఇరుపక్షాల మధ్య పరస్పరం విశ్వాసం లేకపోయినా అవసరాల కోసం తెరవెనుక స్నేహగీతి పాడుకుంటున్నారు. మున్ముందు బీజేపీ ఎటువంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు కనుక అవసరమైతే ఆ పార్టీని టార్గెట్‌ చేసుకోవడానికి వీలుగా విజయ సాయిరెడ్డిని ముఖ్యమంత్రి ప్రయోగిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతానికి చంద్రబాబును బలహీనపర్చడానికే బీజేపీ–వైసీపీ ఉమ్మడిగా కృషి చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకుల భావన. చంద్రబాబు బలహీనపడని పక్షంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడటం ఖాయం. విశేషమేమిటంటే బీజేపీలోని ఓవర్గం తెలుగుదేశంవైపు మొగ్గు చూపుతుండగా, మరోవర్గం వైసీపీ విషయంలో అనుకూల వైఖరి ప్రదర్శించడం! ఇలా అయితే పార్టీ సొంతంగా బలపడటం జరిగే పని కాదని మూడో వర్గంలో నిర్వేదం అలముకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు–విజయ సాయిరెడ్డి మధ్య సాగిన ట్వీట్ల యుద్ధాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 2022లో జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో బీజేపీ ఎత్తుగడలేకాదు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారిపోతాయి.

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-07-12T05:50:56+05:30 IST