రైతులను నట్టేట ముంచారు

ABN , First Publish Date - 2022-07-03T06:44:27+05:30 IST

పంటల బీమా పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ విమర్శించారు.

రైతులను నట్టేట ముంచారు
రైతుపోరు ర్యాలీలో పాల్గొన్న జితేంద్రగౌడు

బీమా మంజూరులో తీవ్ర అన్యాయం

ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఫైర్‌

గుంతకల్లులో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతుపోరు ర్యాలీ

గుంతకల్లు, జూలై 2: పంటల బీమా పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం రైతుపోరు నిర్వహించారు. బీరప్ప సర్కిల్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకుఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.  ముఖ్యమంత్రి జగనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పంటకు, ఎకరానికి రూ.1,500 మాత్రమే ఇచ్చి రైతులకు అన్యాయం చేశారని జితేంద్రగౌడ్‌ మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు జిప్సం, యూరియా, బోరాన, రైతు రథం కింద ట్రాక్టర్లను ఇచ్చామని గుర్తు చేశారు. అలాంటి పథకాలను రద్దు చేయడం అన్యాయమని అన్నారు. అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపడానికి రైతులు, ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీఓ రవీంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ పవన కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీలు రాయల రామయ్య, వీరేష్‌, ప్రతాప్‌ నాయుడు, పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేష్‌, మాజీ ఎంపీటీసీ తలారి మస్తానప్ప, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున,  కౌన్సిలర్లు కె కృపాకర్‌, గుడిపాటి ఆంజనేయులు, అరుణ, తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ, గుత్తి టౌన బ్యాంకు అధ్యక్షుడు అబ్దుల్‌ జిలాన,  నాయకులు రాము, ఫ్రూట్‌ మస్తాన, రామన్న చౌదరి, రాముడు, నందీశ్వర్‌, రంజాన, శివన్న, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-03T06:44:27+05:30 IST