రైతులకు పరిహారం అందించాలి
ABN , First Publish Date - 2021-10-19T06:07:52+05:30 IST
తాటాకు తెగులు సోకి చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, అక్టోబరు 18: తాటాకు తెగులు సోకి చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, తక్కెళ్లపాడుతండా, జెత్యాతండా, వేముపల్లి మండలంలో ఆయన సోమవారం పర్యటించి తెగులు సోకిన వరిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాటాకు తెగులుతో రైతులు పంట నష్టపోయి ఆందోళన చెం దుతున్నారన్నారు. అనేక కష్టాలకోర్చి అప్పుచేసి సాగుచేసిన వరి తీరా చేతికొచ్చే దశలో తెగులు సోకడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, పంటల బీమాను వర్తింపజేయాలన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఎలాంటి సహాయాన్ని అందించకపోగా, వేలాది రూపాయలు పెట్టి సాగుచేసిన పంటపొలాలు కళ్లముందే తెగుళ్ల రూపంలో దెబ్బతినడంతో ఆర్థిక ఊబిలో కూరుకుంటున్నారన్నారు. వెంటనే వ్యవసాయాధికారులు సర్వేనెంబర్ల వారీగా పంట నష్టంపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ఎకరానికి రూ.30వేల నష్టపరిహారం అందజేయాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవినాయక్,వేములపల్లి సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్రెడ్డి, వైస్ ఎం పీపీ పాదూరి గోవర్ధని, ఎంపీటీసీ చైతన్య, నాయకులు పతాని శ్రీను, బాబునాయక్, రవి, చారి, సైదులు, పతాని శ్రీను, ప్రణీత్రెడ్డి పాల్గొన్నారు.