పాకిస్థాన్ పొగడ్తలు రైతులు కోరుకుంటున్నారా?: ప్రశ్నించిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-09-06T23:53:11+05:30 IST

కిసాన్ మహాపంచాయత్‌ను ''రాజకీయ సమీకరణ''గా కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ సోమవారంనాడు..

పాకిస్థాన్ పొగడ్తలు రైతులు కోరుకుంటున్నారా?: ప్రశ్నించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కిసాన్ మహాపంచాయత్‌ను ''రాజకీయ సమీకరణ''గా కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ సోమవారంనాడు అభివర్ణించారు. పాకిస్థాన్ నుంచి రైతులు ప్రశంసలను రైతులు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశ ప్రత్యర్థి చేతిలో బీకేయూ నేత రాకేష తికాయత్ ఒక ఉపకరణంలా మారుతున్నారని తప్పుపట్టారు. బల్యాన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన 'కిసాన్ మహా పంచాయత్'కి భారీగా జనం రావడం, తొమ్మిది నెలలుగా తాము చేపడుతున్న ఆందోళనల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమమని రైతు నేతలు ప్రకటించిన నేపథ్యంలో బల్యాన్ తాజా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వ ప్రశంసలు అందుకోవాలని రైతు నాయకులు అనుకుంటున్నారా అని నిలదీశారు.


ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌కు సంబంధించి రేడియా పాకిస్థాన్ ట్వీట్ చేయడంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ ర్యాలీలు తీస్తుంటారని, ఉత్తరప్రదేశ్‌లోనూ చాలా ర్యాలీలు ఉంటాయని, అయితే రైతు నేతలు ర్యాలీలు, ఆందోళనలతో పాకిస్థాన్ ప్రభుత్వ ప్రశంసలు అందుకోవాలనుకుంటున్నారా అని తాము ప్రశ్నించదలచుకున్నట్టు చెప్పారు. ''దేశ శత్రువులే మనను వ్యతిరేకిస్తుంటారు. మన ప్రత్యర్థులైన పాకిస్థాన్ తరహాలో ఈ నాయకులు (రైతు నేతలు) ఉండాలనుకుంటున్నారా? వాళ్లే ఆలోచించుకోవాలి'' అని బల్వాన్ అన్నారు. సొంత ప్రచారం కోసం ఆందోళనలకు మద్దతిస్తున్నట్టు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల నేతల చేతుల్లో పావులుగా మారవద్దని రైతులను కోరారు. మహాపంచాయత్‌లో వివిధ రాజకీయ పార్టీల జెండాలు, బ్యానర్లు కనిపించాయని, రైతులను ఎవరు ఎర్రకోటకు తీసుకువచ్చారో కూడా అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి అన్నారు.

Updated Date - 2021-09-06T23:53:11+05:30 IST