వరిపై రైతుల అనాసక్తి

ABN , First Publish Date - 2022-05-26T05:09:16+05:30 IST

వరి సాగుకు మరో ఏడాది రైతులు స్వచ్ఛందంగా విరామం ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. గత ఏడాది సాగర్‌ ఆయకట్టులో గణనీయంగా తగ్గిన వరి సాగు ఈ ఏడాది కూడా మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఏబీసీ పరిధిలో 15 వేల ఎకరాలలో మాత్రమే వరి సాగు జరిగింది. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవటంతో పాటు ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

వరిపై రైతుల అనాసక్తి
అద్దంకి ప్రాంతంలో గత ఏడాది సాగు చేసిన మొక్కజొన్న(ఫైల్‌ )

 ఈ ఏడాదీ స్వచ్ఛంద విరామమే

  పెరగనున్న మొక్కజొన్న,  మిర్చి, పత్తి  పంటల సాగు 

అద్దంకి, మే25: వరి సాగుకు మరో ఏడాది రైతులు స్వచ్ఛందంగా  విరామం ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. గత  ఏడాది సాగర్‌ ఆయకట్టులో గణనీయంగా తగ్గిన వరి సాగు ఈ ఏడాది కూడా మరింత తగ్గే అవకాశాలు  కనిపిస్తున్నాయి. గత ఏడాది ఏబీసీ పరిధిలో 15 వేల ఎకరాలలో  మాత్రమే  వరి సాగు జరిగింది. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవటంతో పాటు ధరలు కూడా అంతంత మాత్రంగానే  ఉన్నాయి. దీనికి తోడు పెరిగిన సాగు  వ్యయం,  కూలీల ధరలతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇక వరి సాగు కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అయితే సాగుకు పుష్కలంగా నీరు ఉన్నా అత్యధికశాతం రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు జరిగింది. దిగుబడులు కూడా 30 నుండి 40 క్వింటాళ్లకు తగ్గకుండా వచ్చాయి. ధరలు కూడా రూ. 2 వేల నుంచి 2200 రూపాయల  వరకు ఉంది. దీంతో ఎకరాకు సరాసరిన 70 వేల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. పెట్టుబడులు 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉన్నా 40 నుంచి 50 వేల వరకు మిగిలాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరిగే  అవకాశం కనిపిస్తున్నది. గత ఏడాది  కంటే 50 శాతం పైగానే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.  ఈ నేపఽథ్యంలోనే ఇప్పటికే  పలువురు కౌలు రైతులు పొలాలను ముందస్తుగానే తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. గత ఏడాది మొక్కజొన్న పంట సాగు చేసే పొలాల కౌలు ఎకరాకు 10  నుంచి 12 వేల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 12 వేల నుంచి 14 వేల రూపాయల చొప్పున ముందస్తుగానే కౌలు చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ఇక మిర్చి, పత్తి పంటలు సాగు  కూడా పెరిగే అవవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో  వరి, సుబాబుల్‌ సాగు చేసిన పొలాలు  ఇప్పుడు మొక్కజొన్న సాగుకు సిద్ధం అవుతున్నారు. 

మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉంది

-బొట్లగుంట కోటేశ్వరరావు, రైతు, అంబడిపూడి,బల్లికురవ  మండలం

వరిసాగుతో తీవ్ర నష్టాలు  వస్తుండటంతో  విరమించుకొని  మొక్కజొన్న  సాగు  చేస్తున్నాం. దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న సాగుకు కౌలుకు తీసుకునేందుకు కూడా పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు.  కౌలు  కూడా పెరిగింది. 

Updated Date - 2022-05-26T05:09:16+05:30 IST