వరిసాగుపై రైతుల అనాసక్తి

ABN , First Publish Date - 2021-09-18T07:17:34+05:30 IST

సాగర్‌ ఆయకట్టు మాగాణి భూముల్లో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ పంట సాగుచేయాలో.. అర్ధంకాక రైతులు సతమతమవుతున్నారు.

వరిసాగుపై రైతుల అనాసక్తి

· బీడుగా ఉన్న మాగాణి భూములు       

·కౌలుకు చేసేందుకు ముందుకురాని రైతులు

·గిట్టుబాటు ధర లేదంటున్న రైతులు

దర్శి, సెప్టెంబరు 17 : సాగర్‌ ఆయకట్టు మాగాణి భూముల్లో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఏ పంట సాగుచేయాలో.. అర్ధంకాక రైతులు సతమతమవుతున్నారు. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని అధికారులు చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. గతేడాది పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక కౌలురైతులు నష్టాలు చవిచూశారు. దీంతో ఈ ఏడాది కౌలుకు తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దర్శి ఎన్‌ఎ్‌సపీ డివిజన్‌ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు భూమి ఉండగా అందులో 60 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు నెల గడుస్తున్నా మాగాణి భూములు బీడుగానే ఉన్నాయి. అధికశాతం మంది నార్లు కూడా పోయలేదు. ఏ పైరు సాగు చేయాలో  అర్థంకాక అన్నదాతలు అల్లాడుతున్నారు. సాగుకు పెట్టుబడులు అధికం కావడంతో పాటు గిట్టుబాటు ధర లభించక నష్టం వస్తుండడంతో ఈ ఏడాది కౌలు రైతులు మాగాణి భూములు తీసుకోవడం లేదు. ఎకరాకు ప్రతి సంవత్సరం 15 బస్తాలు కౌలు ఇచ్చేవారు. ఈ ఏడాది ఐదు బస్తాలు కౌలుకు కూడా వరిసాగు చేసేందుకు కౌలుదారులు ముందుకు రావడం లేదు. గతేడాది ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి ఖర్చు అయినప్పటికీ, కేవలం 35 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ధాన్యం బస్తా కేవలం రూ.900కు రైతులు విక్రయించుకున్నారు. గతేడాది పెట్టుబడులు కూడా రాలేదు. కౌలు రైతులు అప్పులు చేసి కౌలు చెల్లించారు. ఈ పరిస్థితిలో ఈ ఏడాది మాగాణి భూముల్లో వరిసాగు ప్రశ్నార్ధకంగా మారింది.

Updated Date - 2021-09-18T07:17:34+05:30 IST