ఆశిష్ మిశ్రా బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకు రైతులు
ABN , First Publish Date - 2022-02-21T20:32:56+05:30 IST
హేయమైన నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జిషీట్లో నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. బాధితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా బలంగా ఉన్నాయి. నిందితుడు మరోమారు..
న్యూఢిల్లీ: లఖీంపుర్ ఖీరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్పై ఫిబ్రవరి 15న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా బెయిల్ను సవాలు చేస్తూ రైతుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రైతులను జీపుతో తొక్కించినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిందుతుడు బెయిల్పై విడుదల కావడాన్ని రైతుల కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషన్ ద్వారా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి.
‘‘హేయమైన నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఛార్జిషీట్లో నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. బాధితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా బలంగా ఉన్నాయి. నిందితుడు మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడమే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో సాక్ష్యాల్ని తారుమారు చేసే న్యాయమైన విచారణకు అడ్డపడుతుంది’’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి.
జనవరి 18న బెయిల్ విచారణ నిమిత్తం తమ తరపు న్యాయవాదికి అనుమతి లభించడకపోవడం వల్ల సమర్ధవంతమైన వాదనలు వినిపించలేకపోయామని, ఈ విషయమై కోర్టును పలుమార్లు ఆశ్రయించినప్పటికీ అవకాశం లభించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంలో విఫలమైనందున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఆశిష్ మిశ్రా బెయిల్పై దాఖలైన రెండో పిటిషన్ ఇది. ఆయన విడుదలైన రెండు రోజుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. అందులో పిటిషనర్లు సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నాయనే అభ్యంతరాలను లేవనెత్తారు.