తమ భూములను పీవోబీ నుంచి తీయించాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-06-28T05:51:30+05:30 IST

తమ భూములను పీవోబీ నుంచి తీయించాలని రైతుల ధర్నా

తమ భూములను పీవోబీ నుంచి తీయించాలని రైతుల ధర్నా
మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న బొమ్మరాసిపల్లి రైతులు

మేడ్చల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ భూములను ధరణి పీవోబీ(ప్రొహిబిటరీ అర్డర్‌ బుక్‌) జాబితాలో చేర్చడంతో శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట రైతులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అధికారులు పట్టించుకోకే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశామన్నారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1965లో దుగ్గిరాల బలరామయ్యకు చెందిన 1,100 ఎకరాలను 250మంది రైతులు కొనుక్కున్నారు. వాటికి పట్టా పాసుబుక్కులూ వచ్చాయి. ఈ 1,100 ఎకరాల్లో 30ఎకరాలపై కోర్టు కేసులున్నాయి. ఈ 30ఎకరాలతోపాటు బొమ్మరాసిపేట రైతులకు చెందిన 1,045ఎకరాలనూ ధరణి పోర్టల్‌లో పీవోబీలోకి చేర్చారు. దీంతో రైతులకు భూమిపై హక్కులే లేకుండా పోయాయి. భూములను పీవోబీ నుంచి తొలగించాలని దరఖాస్తు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతు సంఘం అధ్యక్షుడు రవికిరణ్‌రెడ్డి వాపోయారు. ఇదే అదనుగా దుగ్గిరాల వారసులం అని చెప్పుకుంటూ కొందరు భూములను సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి అనుచరులకు ఎల్‌బీనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిష్టర్‌ చేశారన్నారు. ‘దుగ్గిరాల వారసులు మాకు ఈ భూములు అమ్మారని, ఏదైనా ఉంటే మంత్రి వద్దకు వెళ్లి మాట్లాడుకోండి.’ అంటూ బెదరిస్తున్నారని తెలిపారు. అధికారులు తమ భూములను దొంగచాటుగా రిజిస్ర్టేషన్‌ చేసి, పీవోబీలో చేర్చారని రైతులు ఆరోపించారు. 250 రైతు కుటుంబాలను అదుకోవాలని కోరారు. పీఓబీ భూములపై దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని డీఆర్వో లింగ్యానాయక్‌ రైతులకు తెలిపారు.

Updated Date - 2022-06-28T05:51:30+05:30 IST