ఐక్య రాజ్య సమితికి వెళ్ళాలా? : రైతు నేత రాకేశ్

ABN , First Publish Date - 2021-07-10T19:21:09+05:30 IST

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలనాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలపై

ఐక్య రాజ్య సమితికి వెళ్ళాలా? : రైతు నేత రాకేశ్

న్యూఢిల్లీ : ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలనాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. దీని కోసం రైతులు ఐక్య రాజ్య సమితి తలుపు తట్టవలసిరావచ్చునన్నారు. అయితే కొత్త సాగు చట్టాలపై ఐక్య రాజ్య సమితిని ఆశ్రయించడం గురించి ఉద్యమ నేతలు మాట్లాడలేదని తెలిపారు. కేవలం జనవరి 26నాటి సంఘటనలపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. 


రాకేశ్ తికాయత్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘నిష్పాక్షిక దర్యాప్తు జరపగలిగే ఏదైనా వ్యవస్థ ఇక్కడ ఉందా? లేకపోతే, ఈ అంశాన్ని మేము ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్ళాలా?’’ అని ప్రశ్నించారు. కొత్త సాగు చట్టాలకు సంబంధించిన సమస్యను అంతర్జాతీయ వ్యవస్థల వద్దకు తీసుకెళ్ళాలని రైతు ఉద్యమ నేతలు కోరడం లేదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాల సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్తామని తాము చెప్పలేదన్నారు. జనవరి 26నాటి సంఘటనలపై ప్రశ్నకు మాత్రమే తాము స్పందించామన్నారు. ఈ చట్టాలపై చర్చించాలని కేంద్రం కోరుకుంటే, తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 200 మంది రైతులు జూలై 22 నుంచి పార్లమెంటు వద్ద ధర్నా నిర్వహిస్తారని చెప్పారు. 


రైతులు ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హింసాత్మకంగా మారి, చివరికి రైతులు ఎర్ర కోటపైకి దూసుకెళ్ళారు. ఎర్ర కోటపై ఓ మతపరమైన జెండాను ఎగురవేశారు. పోలీసులు ఇప్పటి వరకు రెండు ఛార్జ్‌షీట్లను దాఖలు చేశారు. 


గత ఏడాది నవంబరు 26 నుంచి రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 





Updated Date - 2021-07-10T19:21:09+05:30 IST