లక్కవరం యూనియన్ బ్యాంకు వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-17T05:18:05+05:30 IST
రైతులు యూనియన్ బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఏడుగురు రైతులపై కేసు
జంగారెడ్డిగూడెం టౌన్, ఆగస్టు 16: తాము బ్యాంకులో జమచేయమన్న సొమ్ములు మాయమయ్యాయి అని అవి తమ ఖాతాలో జమకాకుండానే బ్యాంకు సిబ్బంది కాజేశారని ఆరోపిస్తూ రైతులు పలుమార్లు లక్కవరం యూనియన్ బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధిత బ్యాంకు సిబ్బందిపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇదిఇలా ఉండగా తమ సొమ్ము రికవరీ కావడం లేదని బ్యాంకు వద్ద మరోసారి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది ఎవరూ లోపలికి వెళ్ళకుండా బ్యాంకు తాళాలు వేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాల సురేష్ సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులను స్టేషన్కు తరలించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు.