రైతు సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2020-09-28T11:37:48+05:30 IST
వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
గండేపల్లి, సెప్టెంబరు 27: వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గండేపల్లి మండలం జడ్.రాగంపేట శివారులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కృష్ణదాస్, కన్నబాబు, గోపాలకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్ జనపరెడ్డి హేమశైలు, వైస్ చైర్పర్సన్ రొబ్బల రమణి, డైరెక్టర్లతో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే చంటిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు వంటి హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతులతో మమేకమై మార్కెట్ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్, రాజానగరం, రంపచోడవరం, కాకినాడ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, దవులూరి దొరబాబు, ఒమ్మి దొరబాబు, చలగాల దొరబాబు, దోమాల గంగాధర్, గోపాలపట్నం ప్రసాద్బాబి, జాస్తి వసంత్ పాల్గొన్నారు.