రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-11-01T06:43:35+05:30 IST
రైతు సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మర్పల్లిలో శనివారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు
రైతుబంధు, రైతుబీమా పథకాలతో అండ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పండుగలా సాగుతున్న వ్యవసాయం : ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్
మర్పల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
మర్పల్లి : రైతు సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మర్పల్లిలో శనివారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి రైతుబీమా, రైతుబంధుపథకాలతో ఎంతో మంది అన్నదాతలను ఆదుకున్నట్లు తెలిపారు. మర్పల్లి మండల కేంద్రంలో గోదాముల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు సహకారం అందించేందుకు మార్కెట్ పాలకవర్గం చొరవ చూపాలన్నారు. షాపూర్తండా వాగులో కొట్టుకుపోయిన గిరిజన మహిళ కుటుంబానికి రామేశ్వర్ రూ.లక్ష ఆర్థికసాయం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగని చెప్పగా, ఈ ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగలా చేస్తోందని వారు గుర్తు చేశారు. అంతకుముందు మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా దుర్గంచెర్వు మల్లేషం, డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ లలితారమేష్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ప్రభాకర్గుప్తా, రామేశ్వర్, అశోక్, అంజయ్య, అధికారులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ రగడ
కాగా మండలస్థాయి ప్రజాప్రతినిధులైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ అగౌరవపరుస్తున్నారని జడ్పీటీసీ మధు కర్, ఎంపీపీ లలితారమేష్, వైస్ఎంపీపీ మోహన్రెడ్డి, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్ర మానికిసంబంధించి శుక్రవారం రాత్రి తమకు సమాచారం అందించారని, ఇతర సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రొటో కాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి వారికి నచ్చజెప్పి తిరిగి సమావేశం ప్రారంభించారు. అయితే ఈ సంఘటనతో మర్పల్లి మండలం టీఆర్ఎస్లో వర్గవిబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్రెడ్డి వర్గాలకు పొసగని విషయం తెలిసిందే. ఇటీవలికాలంలో వారి మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది.