ఏపీలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ
ABN , First Publish Date - 2021-06-20T08:58:22+05:30 IST
ఏపీలో వ్యవసాయ కూలీలే అత్యధికంగా ఉన్నారని, రైతుల తర్వాత అత్యధికంగా వారూ ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని సెంట ర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎ్సఈ) వార్షిక సర్వే లో వెల్లడైంది
వారి తర్వాత వ్యవసాయ కూలీలు
సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 44 %
ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 29 శాతం
సీఎ్సఈ వార్షిక సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఏపీలో వ్యవసాయ కూలీలే అత్యధికంగా ఉన్నారని, రైతుల తర్వాత అత్యధికంగా వారూ ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని సెంట ర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎ్సఈ) వార్షిక సర్వే లో వెల్లడైంది. రాష్ట్రంలో 2018లో 365మంది, 2019లో 628 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2018లో 299 మంది, 2019లో 401 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. రాష్ట్రంలో 1,44, 000 హెక్టార్ల భూమిలో ఆర్గానిక్ సాగు జరుగుతోందని, ఆర్థిక, సాగు విధానాలకు వ్యతిరేకంగా 17 నిరసనలు జరిగాయని తెలిపింది. రాష్ట్రం లో పర్యావరణ నేరాలు 2018లో 3, అలాగే 2019లో 2 జరిగాయని వెల్లడించింది. ఇక గ్రామీణ వైద్య మౌలిక సదుపాయాల రంగం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) 3 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీ) 52 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది. సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 44 శాతం ఉంది. పీహెచ్సీ, సీహెచ్సీల్లో కలిపి 29 శాతం ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉంది. భూరికార్డుల విభాగంలో రాష్ర్టానికి 69 స్కోర్ లభించింది.
రాష్ట్రంలోని వ్యవసాయరంగంలో 72 శాతం వ్యవసాయ కార్మికులు, 28 శాతం సాగుదారులు ఉన్నారని పేర్కొంది. సహజ విపత్తులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భారీగా పెరిగింది. సోలార్ విద్యుత్లో 41 శాతం, పవన విద్యుత్లో 51 శాతం, బయోమాస్ ఇంధనంలో 93 శాతం లక్ష్యం 2022 నాటికి పూర్తయ్యింది. రాష్ట్రంలో మూడు సోలార్ పార్కులు ఉన్నాయని సీఎ్సఈ తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సగటున 5.6 కోట్ల మందికి రోజుకు 23 గంటల 55 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2.8 కోట్ల మందికి రోజులో 23.36 గంటల పాటు విద్యుత్ అందుతోందని పేర్కొంది. వాయుకాలుష్యం వల్ల రాష్ట్రంలో 62,808 మంది మరణించారని వెల్లడించింది.