అన్నదాత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-19T06:00:38+05:30 IST

మండలంలోని గుడిపాడు గ్రామంలో అప్పుల బాధతో రైతు మద్దిలేటి (51) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నదాత ఆత్మహత్య

  1. కలిసిరాని వ్యవసాయం
  2. రూ.7 లక్షలు దాటిన అప్పు 


ప్యాపిలి, జనవరి 18: మండలంలోని గుడిపాడు గ్రామంలో అప్పుల బాధతో రైతు మద్దిలేటి (51) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్దిలేటికి 5 ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా వేరుశనగ, టమోటా, ఆముదం వంటి పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకుల్లో, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. ఎలాగైనా గట్టెక్కుదామని మరో రూ.2 లక్షలు అప్పు చేసి గత ఏడాది మూడు బోర్లు వేయించాడు. గంగమ్మ కరుణించ లేదు. దీంతో మొత్తం అప్పులు రూ.7 లక్షలు దాటాయి. అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరులేని సమయంలోఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న రైతును గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు జలదుర్గం పోలీసులు తెలిపారు.  భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-19T06:00:38+05:30 IST