బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-01-09T00:39:20+05:30 IST
ఎన్నికల వేడి రాజుకున్న ఉత్తరప్రదేశ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే చెంపను రైతు చెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన..
లక్నో: ఎన్నికల వేడి రాజుకున్న ఉత్తరప్రదేశ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే చెంపను రైతు చెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా మూడు రోజుల క్రితం ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
వేదికపై కూర్చున్న ఎమ్మెల్యే వద్దకు వచ్చిన రైతు ఆయన చెంపపై ఒక్కటిచ్చారు. ఆ ఘటన చూసి వేదిక మీద ఉన్నవారు, సభకు హాజరైన వారు నివ్వెరపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రైతును పట్టుకుని దూరంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే, ఈ ఘటన తర్వాత మరో ఆసక్తికర ఘటన జరిగింది. చెంపదెబ్బ కొట్టిన రైతుతో కలిసి తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పంకజ్ గుప్తా.. ఆయన తనకు తండ్రి లాంటి వాడని పేర్కొన్నారు. ఆయన తనను ప్రేమతోనే కొట్టాడని, చెంపదెబ్బ కొట్టలేదని వివరణ ఇచ్చారు. ఇద్దరం కలిసి చాలాసార్లు పనిచేశామని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాలు కావాలనే వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సమాజ్వాదీ పార్టీ.. అది ఎమ్మెల్యేకు కొట్టిన చెంపదెబ్బ కాదని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వానికి కొట్టిన దెబ్బ అని విమర్శించింది.