రైతు ద్రోహి సీఎం జగన

ABN , First Publish Date - 2022-06-28T05:25:39+05:30 IST

రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తున్న సీఎం జగన మోహన రెడ్డి రైతు ద్రోహిగా ముద్ర వేసుకున్నాడని కదిరి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతు ద్రోహి సీఎం జగన
పట్టణంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

పంటల బీమాలో ఇంత అన్యాయమా?

ప్రభుత్వ తీరుపై కందికుంట వెంకటప్రసాద్‌ ఫైర్‌

కదిరిలో కదం తొక్కిన రైతులు

300 ట్రాక్టర్లతో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి


  కదిరి, జూన 27: రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తున్న సీఎం జగన మోహన రెడ్డి రైతు ద్రోహిగా ముద్ర వేసుకున్నాడని కదిరి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంటల బీమాలో జరిగిన అన్యాయంపై రైతులతో కలసి సోమవారం కదిరి ఆర్డీఓ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. 300కు పైగా  ట్రాక్టర్లలో రైతులు, టీడీపీ నాయకులు కదిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కదిరి శివారులోని దేవరచెరువు వద్దకు ట్రాక్టర్లు చేరుకున్నాయి. అక్కడి నుంచి జీవిమాను, పూలే, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ కూడళ్ల మీదుగా టవర్‌క్లాక్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లారు. ర్యాలీ సందర్భంగా కదిరి పట్టణం పసుపుమయమైంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రైతులు హోరెత్తారు. పూలే, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు కందికుంట వెంకట ప్రసాద్‌ పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ఇనపుట్‌సబ్సిడీ అందించారన్నారు.  కానీ జగన రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇనపుట్‌సబ్సిడీ రాలేదన్నారు.  వేరుశనగ పంట నష్టపోయినా బీమా కంపెనీ నింబధనలతో రైతులకు అన్యాయం చేశారన్నారు. కేవలం బీమా కంపెనీలకు మాత్రమే సీఎం జగన మేలు చేశాడన్నారు. అన్నం పెట్టే రైతులకు పంటల బీమాలో ఇంత అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. జిల్లాకు వెన్నుదన్నుగా ఉన్న డ్రిప్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. రైతుల్లోకూడా అధికారపక్షం వారిని మాత్రమే గుర్తించి పరిహారం అందించారన్నారు. బీమా కొల్పోయిన ప్రతిరైతుకూ పంటనష్టపరిహారం ఇవ్వాల్సిందేనని కందికుంట డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలోపెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీఓ రాఘవేంద్రకు వినతిప్రతం అందజేశారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు మధు, నిరంజనరెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.












Updated Date - 2022-06-28T05:25:39+05:30 IST