తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-04-17T06:19:45+05:30 IST
తమ భూమికి పట్టాదారు పాసు పుస్తకం కోసం పలు మార్లు దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ అధికారులు స్పందించలేదంటూ తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు ఆత్మహత్యకు యత్నించాడు.
లేపాక్షి, ఏప్రిల్ 16: తమ భూమికి పట్టాదారు పాసు పుస్తకం కోసం పలు మార్లు దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ అధికారులు స్పందించలేదంటూ తహసీల్దార్ కార్యాలయంలోనే రైతు ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం లేపాక్షిలో కలకలం రేపింది. కొండూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సుధాకర్రెడ్డి తన పొలానికి 1.23 ఎకరాల్లో 63 సెంట్ల భూమికి పాసుపుస్తకాల కోసం రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అదే విధంగా మీసేవలో పలుమార్లు తన పొలానికి సంబంధించిన రికార్డులను దాఖలుచేసి పాసుపుస్తకం కోసం దరఖాస్తులు చేశారు. అయితే ప్రతిసారి తహసీల్దార్ కార్యాలయం నుండి తిప్పి పంపుతున్నారేకానీ స్పందిచలేదని రైతు వాపోయారు. శుక్రవారం లేపాక్షి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రైతు సుధాకర్రెడ్డి తన భూమి పట్టాదారు పాసుపుక్తం గురించి అధికారులను ఆడిగారు. అయినా స్పందన రాకపోవడంతో ఆవేదన చెంది తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది రైతును వారించి నీళ్లు పోశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈసందర్బంగా రైతు సుధాకర్రెడ్డి మట్లాడుతూ తన భూమికి సంబందించి ఒరిజినల్ పత్రాలతో పాసుపుస్తకం కోసం రెండేళ్లుగా దరఖాస్తులు చేసుకుని తిరుగుతున్నాని ఇప్పటికే పలు మార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు వాపోయారు. కార్యాలంలో అధికారులు సమాదానం తీరుపట్ల ఆందోళన చెందినట్లు తన భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని కన్నీరుమున్నీరయ్యాడు. తహసీల్థార్ బలరామ్ స్పందింస్తూ చాలా ఏళ్ల కిందట సుధాకర్రెడ్డి అన్నదమ్ముల విషయంలో భూతాగాదా ఉందని కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆవేదనతో ఉన్న సుధాకర్రెడ్డికి సర్థిచెప్పామని ఆయన ఒంటిపై పెట్రోలు పోసుకోలేదన్నారు.