పవన్‌ కోసం తరలివచ్చిన అభిమానులు

ABN , First Publish Date - 2022-05-21T06:27:33+05:30 IST

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కోదాడ పర్యటనకు ఊహించనిస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కోదాడ,

పవన్‌ కోసం తరలివచ్చిన అభిమానులు
పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు ఇళ్లపైకి ఎక్కి చూస్తున్న అభిమానులు, తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న రసూల్‌

హుజూర్‌నగర్‌ / కోదాడ /కోదాడ టౌన్‌,  కోదాడ రూరల్‌, మే 20 : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కోదాడ పర్యటనకు ఊహించనిస్థాయిలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు చెందిన జనసైనికులు పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు ఉదయం 10 గంటల నుంచే కోదాడలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ప్రచారఆర్భాటాలు లేకపోయినా పవన్‌ పర్యటన గురించి సమాచార మాద్యమాల ద్వారా తెలుసుకున్న అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.పవన్‌కల్యాణ్‌ కొమరబండ బైపాస్‌ నుంచి కొమరబండ, కెఎల్‌ఆర్‌ కాలనీ, సాలర్జంగ్‌పేట మీదుగా కోదాడ చేరుకున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా మహిళలను చూసి పవన్‌ దండం పెడుతూ, చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.  

అడుగడుగునా లోపాలు

పవన్‌ పర్యటనలో అడుగడుగునా అనేకలోపాలు కనిపించాయి. కోదాడలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఎదురుగా ఒక నివాసంలో జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు చెక్కు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్‌ను చూసేందుకు అశేషంగా అభిమానులు తరలిరావడంతో పవన్‌కల్యాణ్‌ ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్‌ కుటుంబసభ్యులను పరామర్శించి కొద్దిసేపు మాట్లాడే అవకాశం లేకుండాపోయింది. ఇంటి బయట ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ స్థలంలోనే శ్రీనివాస్‌ తల్లి లక్ష్మమ్మ, అన్న మల్లీశ్వర్‌రావులకు పవన్‌ చెక్కు అందజేశారు. ఈ సమయంలో అభిమానులు పవన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. పవన్‌ చుట్టూ 20 మంది బాడీగార్డులు, వచ్చిన కొద్దిమంది పోలీసులు కూడా అభిమానులను నిలువరించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పవన్‌ బాధితులకు చెక్కు ఇచ్చి జనం ఎక్కువగా ఉన్నారు మళ్లీ హైదరాబాద్‌లో కలుద్దాం, పిలిపించుకుని మాట్లాడుతా మీ కుటుంబానికి అండగా ఉంటానని అభయమిచ్చి వెనుదిరిగారు. కాగా దీంతో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి సుమారు 40 నుంచి 50 వేల జనాభా తరలివచ్చారు. పవన్‌ ప్రసంగించకపోవడం, కనీసం కాన్వాయ్‌ నుంచైనా మాట్లాడుతారేమోనని కార్యకర్తలు ఆశించారు. అది కూడా లేకపోవడంతో కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు. దీంతో పవన్‌పర్యటన విజయవంతం అయినప్పటికీ ఆయన ప్రసంగం లేకుండానే ముగిసిందన్న ఆవేదనతో అభిమానులు ఉన్నారు. పవన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు సరైన బందోబస్తు ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల కారణంగానే పవన్‌ ప్రసంగం లేకుండా పర్యటన ముగిసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

తొక్కిసలాట : ముగ్గురికి తీవ్ర గాయాలు

పవన్‌కల్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొమరబండ బైపాస్‌ నుంచి కోదాడలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొమరబండ స్టేజీ వద్ద ఒక్కసారిగా ఆయన అభిమానులు పవన్‌కల్యాణ్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడటంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో కూచిపూడి గ్రామానికి చెందిన నాగుల్‌మీరా అలియాస్‌ రసూల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కోదాడకు చెందిన ఇరువురు శివ, చెన్నకేశవరావులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రసూల్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.  రసూల్‌ కుటుంబ సభ్యులు మాత్రం పవన్‌ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న వాహనం ఢీకొనడం వల్లే గాయపడ్డారని అన్నారు. 

పవన్‌కు ఘనస్వాగతం

సూర్యాపేటరూరల్‌: జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి కోదాడ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట మండలం జనగాం క్రాస్‌ రోడ్డులో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకొని ఘనస్వాగతం పలికారు. అభిమానులు పూలదండలు కాన్వాయ్‌ మీదికి ఎగురవేసి నినాదాలు చేశారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ స్తంభించకుండా చర్యలు తీసుకున్నారు.



Updated Date - 2022-05-21T06:27:33+05:30 IST