Friendship Day వీడియో షేర్ చేసిన యువీ.. ధోనీ ఎక్కడన్న అభిమానులు
ABN , First Publish Date - 2021-08-01T22:20:08+05:30 IST
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ షేర్ చేసిన వీడియోలో అతడి సమకాలీనులు
న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ షేర్ చేసిన వీడియోలో అతడి సమకాలీనులు అందరూ ఉన్నా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కనిపించకపోవడం విపరీత చర్చకు దారితీసింది. ‘ఫ్రెండ్స్ దట్ బికేమ్ ఫ్యామిలీ’ ట్యాగ్తో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అక్టోబరు 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యువరాజ్ సింగ్.. హర్భజన్ సింగ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడాడు. వీరందరూ కలిసి ఆడిన ఆ కాలాన్ని క్రీడా నిపుణులు ఇప్పటికీ ఇండియన్ క్రికెట్కు స్వర్ణ యుగంగా అభివర్ణిస్తుంటారు. వీరందరూ ఉన్న ఆ జట్టు 2003 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి భారత జట్టు సంయుక్త విజేతగా అవతరించింది.
యువరాజ్ సింగ్ తన కెరియర్లో కొన్ని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. డ్రెస్సింగ్ రూము అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ యువీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ వీడియోను రూపొందించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అంత వరకు బాగానే ఉన్నా ఆ వీడియోలో ధోనీ ఒక్కసారి కూడా కనిపించకపోవడంతో అభిమానులు విస్తుపోతున్నారు. ధోనీ ఎందుకు లేడంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
నిజానికి తనతోపాటు ఆడిన దిగ్గజ క్రికెటర్లు ఒక్కొక్కరుగా క్రికెట్కు గుడ్బై చెప్పేసిన తర్వాత తర్వాతి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటివారితో యువరాజ్ చాలా సన్నిహితంగా మెలిగాడు. కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ బ్యాట్ పట్టిన యువరాజ్ 2014లో టీ20 ప్రపంచకప్ ఆడాడు. ధోనీతో కలిసి ఆడడాన్ని ఎంజాయ్ చేసేవాడు. నిజానికి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా.
అయినప్పటికీ ఫ్రెండ్షిప్ డే వీడియోలో ధోనీ, కోహ్లీతో కలిసి ఉన్న ఒక్క ఫన్నీ ఫొటో కూడా కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. యువీ ఫామ్ కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు ధోనీ, కోహ్లీ అతడికి అండగా నిలబడ్డారని కొందరు అంటే, మరికొందరు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ వీడియోలో ధోనీ కనిపించకపోవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తుండడంతో యువీ స్పందిస్తాడేమో వేచి చూడాల్సిందే.