పొలం నుంచి తిరిగొచ్చిన తండ్రి.. ఇంట్లో షాకింగ్ సీన్.. ఊరినే మాయ చేయబోయిన కుటుంబం!

ABN , First Publish Date - 2021-07-24T02:11:12+05:30 IST

పొలంలో కష్టపడుతుండగా మందు వేసుకోవాలని ఇంటికెళ్లాడా కుమారుడు. సరేలే అని తాము పని చేసుకుంటూ ఉండిపోయారా వృద్ధ తల్లిదండ్రులు.

పొలం నుంచి తిరిగొచ్చిన తండ్రి.. ఇంట్లో షాకింగ్ సీన్.. ఊరినే మాయ చేయబోయిన కుటుంబం!

ఇంటర్నెట్ డెస్క్: పొలంలో కష్టపడుతుండగా మందు వేసుకోవాలని ఇంటికెళ్లాడా కుమారుడు. సరేలే అని తాము పని చేసుకుంటూ ఉండిపోయారా వృద్ధ తల్లిదండ్రులు. మధ్యాహ్నమైనా కొడుకు తిరిగి రాలేదు. దీంతో ఆహారం కోసం ఇంటికొచ్చాడా తండ్రి. ఇంటికొచ్చిన తర్వాత ఆయన గుండెలు పగిలే దృశ్యం కనిపించింది. రక్తపు మడుగులో కోడలు పడి ఉండగా, ఆమె పక్కనే చేతిలో కత్తెరతో కొడుకు కూర్చొని ఉన్నాడు. భయంతో ఏం చేయాలో తెలియని ఆ వృద్ధుడు చుట్టుపక్కల వారిని పిలిచి కోడలిని ఆస్పత్రికి తీసుకెళ్లబోయాడు. కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆ తండ్రి ఒక పథకం వేశాడు.


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మాయ(25), శ్రీరామ్(28) భార్యాభర్తలు. శ్రీరామ్‌కు కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి సరిగా లేదు. దీనికోసం ఇటీవలే ఒక వైద్యుడిని కూడా కలిశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ట్యాబ్లెట్లు వేసుకోవాలంటూ పొలం నుంచి శ్రీరామ్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆ గొడవలోనే ఇంట్లోని కత్తెర తీసుకొని భార్య పీక కోశాడు శ్రీరామ్. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న భార్య శరీరం పక్కనే కూర్చున్నాడు. శ్రీరామ్ తండ్రి ఇంటికొచ్చే సరికి ఆమె ప్రాణాలు పోయాయి. రక్తపు మడుగులోని కోడలు, పక్కనే కొడుకును చూసిన అతనికి విషయం అర్థమైంది. అయితే బిడ్డను కాపాడుకోవడానికి ఆ కుటుంబం ప్లాన్ చేసింది.


కోడలి కుటుంబానికి ఫోన్ చేసి ‘‘మీ అమ్మాయికి ఆరోగ్యం బాలేదు’’ అని చెప్పారు. కాసేపటికి ఫోన్ చేసి ఆమె చనిపోయిందని అన్నారు. కడసారి చూపుకోసం వచ్చిన వారిని దూరంగా నిలుచోబెట్టి మొహం మాత్రం చూపించారు. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోయాయి. మృతదేహాన్ని స్మశానానికి కూడా తీసుకెళ్లిపోయారు. అయితే అక్కడి స్థానికుల్లో కొందరు ఆమె హత్య జరిగినట్లు చెప్పుకుంటున్న మాటలు మాయ కుటుంబం చెవిన పడ్డాయి. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్మశానానికి చేరుకొని పరిశీలించగా మాయ పీక కోసి చంపినట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-24T02:11:12+05:30 IST