అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-07T15:36:49+05:30 IST
అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిపేట జిల్లా కావేరిపాక్కం పంచాయతీ కంబన్ మొదలి వీధికి చెందిన రామలింగం (66) షోలింగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో
వేలూరు(చెన్నై): అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిపేట జిల్లా కావేరిపాక్కం పంచాయతీ కంబన్ మొదలి వీధికి చెందిన రామలింగం (66) షోలింగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు అనూరాధ (57) అనే భార్య, విష్ణు (29), భరత్ (28) అనే కుమారులున్నారు. పెద్దకుమారుడు విష్ణు బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా రెండు నెలల క్రితం వివాహమై బెంగళూరులో ఉంటున్నాడు. చిన్న కుమారుడు కోవైలో ఐటీ సంస్థ ఉద్యోగి కాగా, ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, విష్ణు ఆదివారం సాయంత్రం తండ్రికి ఫోన్ చేయగా తీయకపోవడంతో అదే ప్రాంతంలో నివసిస్తున్న పినతండ్రి శివకుమార్కు సమాచారం అందించాడు. శివకుమార్ అక్కడకు వెళ్లి పలుమార్లు పిలిచినా సమాధానం లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోనికి వెళ్లగా అక్కడ ఓ గదిలో రామలింగం, అనూరాధ, మరొక గదిలో భరత్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండడం కనిపించింది. సమాచారం అందుకున్న కావేరిపాక్కం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.