లాడ్జిలో గది అద్దెకు తీసుకుని రోజంతా తలుపులే తీయలేదు.. సిబ్బందికి డౌట్.. పోలీసులకు ఫోన్.. తలుపులు తీసి చూస్తే..

ABN , First Publish Date - 2022-05-06T19:56:15+05:30 IST

ఆ భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి ఓ లాడ్జ్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు.. ఒక రోజుంతా ఆ గదిలో నుంచి ఎవరూ బయటకు రాలేదు..

లాడ్జిలో గది అద్దెకు తీసుకుని రోజంతా తలుపులే తీయలేదు.. సిబ్బందికి డౌట్.. పోలీసులకు ఫోన్.. తలుపులు తీసి చూస్తే..

ఆ భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి ఓ లాడ్జ్‌కు వెళ్లి గది అద్దెకు తీసుకున్నారు.. ఒక రోజుంతా ఆ గదిలో నుంచి ఎవరూ బయటకు రాలేదు.. దీంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా లోపల నలుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు.. పిల్లలిద్దరూ మంచం మీద పడి ఉండగా.. భార్యభర్తలు ఉరి వేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


రాయ్‌పూర్‌కు చెందిన జితేంద్ర దేవాంగన్ అనే వ్యక్తి తన భార్య సవిత, ఇద్దరు పిల్లలు గుంగున్, తుక్‌తుక్‌తో కలిసి బుధవారం ఉదయం కంకేర్‌లోని బస్తర్ లాడ్జ్‌కు వెళ్లాడు. బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు వారు గది తలుపులు తెరిచి బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా నలుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లలిద్దరికీ విషం ఇచ్చి చంపిన తర్వాత భార్యాభర్తలు ఉరి వేసుకున్నారు. 


ఉరి వేసుకున్న భార్యాభర్తల చేతులు వెనుక నుంచి కట్టి ఉండడంతో పోలీసులు ఈ కేసును అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. బంధువులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లోని జితేంద్ర దేవాంగన్ చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు. 

Read more