గ్రూప్స్లో కీర్తి పతాక
ABN , First Publish Date - 2022-07-06T06:19:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో అనకాపల్లి జిల్లా మహిళ దాట్ల కీర్తి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించారు.
రాష్ట్రస్థాయిలో అనకాపల్లి జిల్లా మహిళకు ఎనిమిదో ర్యాంకు
డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో అనకాపల్లి జిల్లా మహిళ దాట్ల కీర్తి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించారు. ఏపీపీఎస్సీలో ప్రధానమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. కీర్తి స్వస్థలం మాకవరపాలెం మండలం రాజులనగరం. ప్రస్తుతం ఆమె విజయనగరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిగా పనిచేస్తున్నారు.
కీర్తి తొలుత బీఎస్సీ, బీఈడీ చేసి టీచర్గా ఎన్నికయ్యారు. అచ్యుతాపురం మండలం గొర్లెధర్మవరం యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సమయంలో 2011లో గ్రూప్-1 పరీక్షలు రాశారు. బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపిక కాగా 2018లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపిక కావాలనే లక్ష్యంతో 2018లో గ్రూప్-1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ రాశారు. ప్రిలిమినరీలో 112 మార్కులు సాధించారు. మెయిన్స్లో మంచి మార్కులు సాధించిన కీర్తి, గత నెలలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వీటి ఫలితాలు మంగళవారం విడుదల కాగా ఆమె ఎనిమిదో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు.
కుటుంబం..
కీర్తి తండ్రి దాట్ల జగన్నాథరాజు టీచర్గా పనిచేసి రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తల్లి నిర్మల ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలోని ఒక ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. కాగా కీర్తి భర్త ప్రదీప్ విశాఖలో వ్యాపారవేత్తగా స్థిరపడగా కుమారుడు విశ్వక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ప్రజలకుసేవ చేసే అవకాశం : కీర్తి
బీసీ వెల్ఫేర్ అధికారిగా గడచిన నాలుగేళ్లలో విద్యార్థులు చదువుపరంగా అభివృద్ధి చెందేందుకు పాటుపడ్డాను. అయితే సమాజంలో అన్నివర్గాల ప్రజలకు సేవ చేయడానికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఎంతో ఉపయోగపడుతుంది. డివిజన్లో ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితాశయం నేరవేరింది.