పడకేసిన ముకుందాపూర్!
ABN , First Publish Date - 2022-10-02T05:42:20+05:30 IST
పడకేసిన ముకుందాపూర్!
- గ్రామంలో పలువురికి అస్వస్థత
- నలుగురి పరిస్థితి ఆందోళనకరం
- విచారణ చేసిన తాండూరు ఎక్సైజ్ పోలీసులు
తాండూరు, అక్టోబరు 1 : యాలాల మండలం ముకుందాపూర్లోని ప్రజలు రెండు రోజులుగా అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటి వరకు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో 20మంది వరకు చికిత్సలు చేయించుకున్నారు. శనివారం రాత్రి ఆ గ్రామానికి చెందిన వడ్ల అంతమ్మ, వడ్ల రాములమ్మ, లాలమ్మ, దేవమ్మ మూర్చతో పడిపోయి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారా.. లేక వైరల్ ఫీవర్తోనా అన్న విషయం తెలియాల్సి ఉంది. తాండూరు ఎక్సైజ్ సీఐ చంద్రకాంత్రెడ్డి సిబ్బందితో శనివారం ముకుందాపూర్ గ్రామానికి వెళ్లి అక్కడి కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు. కల్లు శాంపిళ్లను కూడా సేకరించి నివేదిక కోసం ల్యాబ్కు పంపారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్ద ఎక్సైజ్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు.