గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2021-04-16T05:20:42+05:30 IST

బుధవారం రాత్రి గాలివాన బీభత్సానికి పోరుమామిళ్ల ఉద్యానవశాఖ డివిజన పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లో 150 ఎకరాల్లో అరటి దెబ్బతిని రూ.75లక్షలు నష్టం వాటిల్లింది.

గాలివాన బీభత్సం
పోరుమామిళ్లలో చెరువుకింద నేలకొరిగిన వరి పైరును పరిశీలిస్తున్న ఏఈవో

నేలకొరిగిన అరటి చెట్లు

150 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి

రూ.75 లక్షల నష్టం

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 15: బుధవారం రాత్రి గాలివాన బీభత్సానికి పోరుమామిళ్ల ఉద్యానవశాఖ డివిజన పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లో 150 ఎకరాల్లో అరటి దెబ్బతిని రూ.75లక్షలు నష్టం వాటిల్లింది. ఊహించని విధంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఈ మండలాల్లో అరటి దెబ్బతింది. పోరుమామిళ్ల మండలంలో రాచాయిపేట, అక్కల్‌రెడ్డిపల్లె, సిద్దవరం ప్రాంతాల్లో పది ఎకరాలు, కలసపాడు మండలంలో 30 ఎకరాలు, కాశినాయన మండలంలో 110 ఎకరాలు మొత్తం 150 ఎకరాల అరటి దెబ్బతిందని ఉద్యాన శాఖ డివిజన అధికారి ఈశ్వర్‌ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు నష్టాన్ని గురువారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. మొత్తం రూ.75 లక్షలు నష్టం వాటిల్లిందని అంచనా. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.


75 ఎకరాల్లో వరి, సజ్జ నష్టం

పోరుమామిళ్ల మండలంలో గాలివానకు 50 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో సజ్జ దెబ్బతిందని వ్యవసాయాధికారి వరహరికుమార్‌ తెలిపారు. గురువారం ఏఈవోలు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి అంచనా వేశారు. పోరుమామిళ్లలోని చెరువుకట్ట సమీపంలో వరి నేలకొరిగింది. అలాగే రామేశ్వరం, సిద్దవరం, రంగసముద్రం ప్రాంతాల్లో సజ్జ పూర్తిగా దెబ్బతిని రైతులకు నష్టం తెచ్చిపెట్టింది.


పిడుగుపాటుకు రెండుగా చీలిన వేపచెట్టు

బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకు చెందిన పొద రమణయ్య అనే రైతు పొలంలో పిడుగు పడింది. పిడుగు వేపచెట్టుపై పడ్డంతో అది రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - 2021-04-16T05:20:42+05:30 IST