Chittoor: నకిలీ హోంగార్డుల స్కామ్ వ్యవహారం.. ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ..

ABN , First Publish Date - 2022-09-18T17:17:50+05:30 IST

నకిలీ హోంగార్డుల స్కామ్ వ్యవహారంతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది.

Chittoor: నకిలీ హోంగార్డుల స్కామ్ వ్యవహారం.. ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ..

చిత్తూరు జిల్లా (Chittoor Dist.): నకిలీ హోంగార్డుల స్కామ్ (Fake Home Guards Scam) వ్యవహారంతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. గత కొన్ని ఏళ్లుగా హోంగార్డ్ శాఖలో కొనసాగుతున్న నకిలీ డివోల పరంపరకు జిల్లా పోలీసు యంత్రాంగం బ్రేక్ వేసింది. గత రెండేళ్లుగా ఆ నోట ఈ నోట పడి.. ఆకాశరామన్న పిటిషన్లతో హోంగార్డుల స్కామ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిపార్టుమెంట్ పరువు పోతుందనో లేక స్కామ్‌కు సహకరించిన కొంతమంది ఉన్నతాధికారుల చేతివాటం బయట పడుతుందనో విచారణ అత్యంత గోప్యంగా కొనసాగుతోంది. 


లాబీయింగ్, లంచాలతో నకిలీ డివో ద్వారా హోంగార్డులుగా సుమారు 220 మంది విధుల్లోకి చేరారు. వారిలో 100 మంది హోంగార్డులు అర్హతతో వచ్చి.. మెరిట్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పొందారు. హోంగార్డు శాఖలో తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, ఆర్టీసీ, రోడ్డు రవాణా శాఖ, ఎఫ్‌సిఐ గోడౌన్ లాంటి పోలీస్ శాఖకు సంబంధం లేని చోట్ల వారు విధులు నిర్వహించడం.. అక్రమార్కులకు రాచమార్గంగా మారింది. ఇలాంటి ప్రదేశాల్లో వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీల హోంగార్డు నెంబర్లతో అక్రమార్కులు నకిలీ డీవోలు సృష్టించినట్లు విచారణలో వెల్లడినట్టు సమాచారం. ప్రస్తుతం నూతనంగా చిత్తూరు జిల్లా విభజన కావడంతో చిత్తూరు జిల్లాలోని నకిలీ హోంగార్డులను ముగ్గురు సిఐలతో కూడిన బృందం విచారణ చేపట్టింది. ఈ స్కామ్‌లో  ప్రధాన సూత్రధారుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచి పోలీస్ శాఖ విచారణ జరుపుతోంది.

Updated Date - 2022-09-18T17:17:50+05:30 IST