నవీపేటలో ఫ్యాక్షన్‌ తరహా హత్య

ABN , First Publish Date - 2020-02-22T07:52:34+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఫ్యాక్షన్‌ తరహా హత్య చోటుచేసుకుంది. కొంచ రమణారెడ్డి(54) అనే వ్యక్తిని శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దారుణంగా నరికి చంపారు.

నవీపేటలో ఫ్యాక్షన్‌ తరహా హత్య

వ్యక్తిని నరికి చంపిన దుండగులు

నవీపేట, ఫిబ్రవరి 21: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఫ్యాక్షన్‌ తరహా హత్య చోటుచేసుకుంది. కొంచ రమణారెడ్డి(54) అనే వ్యక్తిని శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్‌ మాజీ సర్పంచ్‌ కొంచ వెంకట్‌రెడ్డి కుమారుడు రమణారెడ్డి.. ఏడేళ్లుగా తన భార్య నాగసులోచనతో మనస్పర్థల కారణంగా నవీపేటలో విడిగా ఉంటున్నారు. వీరి రెండో కూతురు రక్షిత తండ్రివద్ద.. పెద్దకూతురు హరిణి, మూడో కూతురు హిమబిందు తల్లితో ఉంటున్నారు. రమణారెడ్డి, నాగజులోచన మధ్య కోర్టులో విడాకుల కేసు కొనసాగుతోంది. కాగా.. శుక్రవారం శివరాత్రి కావడంతో రమణారెడ్డి ఉదయమే ఆలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆలోగా తన తల్లిదండ్రులకు పండ్లు ఇచ్చిరమ్మని కూతురిని పంపారు. అతను ఇంటి ముందు ఎదురు చూస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఇంటికి తిరిగి వచ్చిన రక్షిత.. రక్తపుమడుగులో పడిఉన్న తండ్రిని చూసి, గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న రమణారెడ్డిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందారు. సంఘటనాస్థలాన్ని నవీపేట ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న ప్రొబెషనరీ ఐపీఎస్‌ కిరణ్‌ ప్రభాకర్‌, నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివా్‌సకుమార్‌, సీఐ రఘునాథ్‌, ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. తన తండ్రి హత్య వెనక.. తల్లి నాగసులోచన, మరో వ్యక్తిపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రక్షిత పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-22T07:52:34+05:30 IST