ఫార్మాసిటీలోని ‘సాయినార్’లో ప్రమాదానికి అసలు కారణమిదే..!
ABN , First Publish Date - 2020-07-04T19:07:51+05:30 IST
పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్స్లో మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ వి.వినయ్చంద్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ‘సాయినార్’లో ప్రమాదంపై నలుగురు
మానవ తప్పిదమే.. విచారణ కమిటీ నివేదిక
ఉద్యోగి నిర్లక్ష్యమే కారణమని గుర్తింపు
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్స్లో మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ వి.వినయ్చంద్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ‘సాయినార్’లో ప్రమాదంపై నలుగురు అధికారులతో నియమించిన కమిటీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిందన్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ గాఢత వల్లే ఇద్దరు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.15 లక్షలు వంతున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించినట్టు చెప్పారు. కంపెనీ నుంచి రూ.35 లక్షలు వంతున పరిహారం ఇవ్వనున్నారని, బాధిత కుటుంబాల్లో అర్హత మేరకు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఉద్యోగి నిర్లక్ష్యమే కారణం?
మందుల ఉత్పత్తి క్రమంలో మదర్ లిక్కర్ను రియాక్టర్లోకి పంప్ చేసే సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం సంభవించిందని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. కంపెనీలో బెంజ్మిడజోల్ ఉత్పత్తి చేస్తుండగా మూడో దశలో ప్రమాదం జరిగిందని గుర్తించింది. మదర్ లిక్కర్ను రియాక్టర్లోకి...అక్కడ నుంచి ఎఫ్లూయింట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపాలి. ఇందుకోసం స్టోరేజ్ చేసే క్రమంలో రియాక్టర్ బయట అమర్చాల్సిన హోస్ పైపును నేరుగా లోపల పెట్టడంతో ప్రమాదం జరిగిందని విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ విషయంలో షిఫ్ట్ ఇన్చార్జి అభ్యంతరం చెప్పినా సదరు ఉద్యోగి పట్టించుకోకుండా హోస్ పైపు పెట్టేసి కిందకు వెళ్లిపోయినట్టు తెలిసింది. కానీ షిఫ్ట్ ఇన్చార్జి ఆదేశాల మేరకు హోస్ పైపును అమర్చినట్టు క్షతగాత్రులు చెబుతున్నారు. ఆ షిఫ్ట్ ఇన్చార్జి ప్రమాదంలో చనిపోవడంతో వారు చెబుతున్న మాటలు నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అయితే...ఉత్పత్తి సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా వుండాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం ఇందుకు కారణమని కమిటీ గుర్తించింది. ప్రమాదం జరిగే సమయంలో కొన్ని ఉత్పత్తులు వివిధ దశలలో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన తరువాత కంపెనీని మూసివేయాలని కమిటీ సిఫారసు చేయనున్నది.