బిచ్కుంద బస్టాండ్లో సౌకర్యాలు కరువు
ABN , First Publish Date - 2022-05-16T04:57:49+05:30 IST
బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువైయ్యాయి. మండల కేంద్రంలో ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం మూడున్నర దశాబ్దాల కిందట బస్టాండ్ నిర్మించారు.
- ఆర్టీసీ అధికారుల పనితీరుపై మండిపడుతున్న ప్రయాణికులు
బిచ్కుంద, మే 15: బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువైయ్యాయి. మండల కేంద్రంలో ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం మూడున్నర దశాబ్దాల కిందట బస్టాండ్ నిర్మించారు. బిచ్కుంద మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల ప్రజలు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. నియోజకవర్గంలోని దినదినభివృద్ధి చెందుతూ కేంద్రబిందువైన బిచ్కుంద పట్టణంలో ప్రయాణం కోసం నిర్మించబడిన బస్టాండ్లో మాత్రం ప్రజలకు కనీసం తాగునీరు, కూర్చునేందుకు బెంచీలు కూడా లేని పరిస్థితి. బస్టాండ్ నిర్మాణ సమయంలో నిర్మించిన మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరి మురికి నీరంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహించి పందులు, పశువులు సంచరిస్తూ తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు పనికిరాకపోవడంతో ఏడేళ్ల కిందట కొత్త మరుగుదొడ్ల పనులు చేపట్టి గోడలు నిర్మించి అర్ధాంతరంగా వదిలేశారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ వాహనదారులు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో బస్సులు తిరిగేందుకు వీలు లేకుండా పోయి డ్రైవర్లు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. సంస్థకు ప్రయాణికులే దేవుళ్లు అంటూ ప్రచారం చేసే అధికారులు బస్టాండ్లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు.