ఐసోలేషన్ వార్డుల్లో సౌకర్యాలు కల్పించండి
ABN , First Publish Date - 2020-04-08T11:55:19+05:30 IST
ఐసోలేషన్ వార్డుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కరోనా వైరస్ నియంత్రణ రాష్ట్ర పరిశీలకుడు ఎం.ఎం.నాయక్
ప్రత్యేకాధికారి ఎంఎం నాయక్ ఆదేశం
రాజాం /రూరల్/ఎచ్చెర్ల, ఏప్రిల్ 7: ఐసోలేషన్ వార్డుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కరోనా వైరస్ నియంత్రణ రాష్ట్ర పరిశీలకుడు ఎం.ఎం.నాయక్ ఆదేశించారు. మంగళవారం రాజాం, ఎచ్చెర్ల ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాజాంలోని సెయింటాన్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ వేణుగోపాలరావు, నగరపంచాయతీ కమిషనర్ ఎన్.రమేష్ను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జీఎమ్ఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిని సందర్శించారు.
ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని ఐసోలేషన్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అక్కడ 14 రోజులుగా ఉంటున్నామని... క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన తమను ఇళ్లకు పంపించాలని పలువురు నాయక్ను కోరారు. ఈ విషయమై కలెక్టర్ నివాస్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీఇచ్చారు. ప్రతిఒక్కరికీ కేస్ షీట్ను నిర్వహించాలని, అవసరమైతే శాంపిల్స్ తీయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సనపల సుధాసాగర్ ఉన్నారు. ఇదిలా ఉండగా, చిలకపాలెంలోని శ్రీ శివానీ, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.