విద్వేష వ్యాప్తికి బీజేపీ ఆయుధం ఫేస్‌బుక్ : కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-13T02:21:08+05:30 IST

దేశంలో విద్వేషం, బూటకపు వార్తల వ్యాప్తికి

విద్వేష వ్యాప్తికి బీజేపీ ఆయుధం ఫేస్‌బుక్ : కాంగ్రెస్

న్యూఢిల్లీ : దేశంలో విద్వేషం, బూటకపు వార్తల వ్యాప్తికి ఆయుధంగా ఫేస్‌బుక్‌ను బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను కట్టడి చేయడానికి చట్టాలను రూపొందించాలని కోరింది. ఓ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ మన దేశ ప్రజాస్వామ్యాన్ని చాకచక్యంగా ప్రభావితం చేస్తోందని ఆరోపించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని గట్టిగా కోరింది. 


కాంగ్రెస్ నేతలు రోహన్ గుప్తా, ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో విద్వేషం, బూటకపు వార్తల వ్యాప్తికి ఆయుధంగా ఫేస్‌బుక్‌ను బీజేపీ వాడుకుంటోందని, ఓ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ మన దేశ ప్రజాస్వామ్యాన్ని చాకచక్యంగా ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. దేశ ఐకమత్యానికి విఘాతం కలిగించే విద్వేషాన్ని వ్యాపింపజేయడానికి తనను బీజేపీ ఉపయోగించుకోకుండా ఫేస్‌బుక్ ఆపవలసిన సమయం వచ్చిందన్నారు. ఫేస్‌బుక్ చైర్మన్ మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ ఓ లేఖ రాసిందని చెప్పారు. భారత దేశంలో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా విద్వేష ప్రసంగాలు, బూటకపు వార్తలు వ్యాపిస్తున్నాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు తెలిపారు. ఫేస్‌బుక్ ఇండియా పనితీరుపై అంతర్గత దర్యాప్తు జరిపించాలని, ఆ దర్యాప్తు వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. 


ఇదంతా కేవలం కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని చక్రవర్తి చెప్పారు. ఇది మన దేశ ప్రజాస్వామ్యపు పవిత్రత, పటిష్టతలకు సంబంధించిన విషయమని తెలిపారు. ఇది భారత దేశం, భారతీయులకు సంబంధించినదన్నారు. విదేశీ టెక్నాలజీ కంపెనీలు మన సమాజాన్ని నియంత్రించడాన్ని ఆమోదిద్దామా? అని ప్రశ్నించారు. దీనిని నిరోధించేందుకు ఓ దేశంగా మనమంతా కలిసి రావాలన్నారు. 


Updated Date - 2021-11-13T02:21:08+05:30 IST