-
-
Home » Andhra Pradesh » Extreme storm threat-NGTS-AndhraPradesh
-
తీవ్ర తుఫాన్ ముప్పు!
ABN , First Publish Date - 2022-05-08T07:52:00+05:30 IST
తీవ్ర తుఫాన్ ముప్పు!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
నేటి ఉదయానికి తుఫాన్గా మార్పు
సాయంత్రానికి తీవ్ర తుఫానుగా: వాతావరణ శాఖ
10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
కోస్తా ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచన
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా, రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,140 కి.మీ., పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 1,180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం ఉదయానికి తుఫాన్గా, సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్గా మారిన తర్వాత దీనికి ‘అసాని’ అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును శ్రీలంక సూచించింది. సింహళి భాష లో అసాని అంటే ‘కోపం’. తీవ్ర తుఫాన్ ఈ నెల పదో తేదీ వరకు వాయవ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యం గా దిశ మార్చుకుని ఒడిశా తీరానికి ఆనుకుని వాయ వ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అలాగే, కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక ఎగురవేశారు.
ఇప్పటికే తుఫాన్గా మారింది: నిపుణులు
కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాతావరణ పరిస్థితుల మేరకు తుఫాను మధ్య బంగాళాఖాతంలోనే దిశ మార్చుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికే వాయుగుండంగా బలపడి శనివారం మధ్యాహ్ననికే ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్గా మారిందన్నారు. అయితే దీనిని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ధ్రువీకరించలేదు. శనివారం ఉదయానికి వాయుగుండంగా మారిందని, ఆదివారం ఉదయానికి తుఫాన్గా బలపడుతుందని ఐఎండీ వివరించింది.