అదనపు కట్నం కోసం వేధింపు
ABN , First Publish Date - 2020-11-28T05:42:07+05:30 IST
అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో చోటుచేసుకుంది.
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
డిచ్పల్లి, నవంబరు 27: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు శ్రీమాన్ అదే గ్రామానికి చెందిన తన మేనమరదలిని ఏడాది కిందట రూ.10లక్షల కట్నం, కారు, కట్నకానుకలు తీసుకుని వివాహం చేసుకున్నాడు. మళ్లీ అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో ఆతని వేధింపులు తాళలేక భార్య సుద్దులం గ్రామంలో భర్త ఇంటి ఎదుట తల్లిదండ్రులు, గ్రామ మహిళలతో కలిసి ఆందోళనకు దిగింది. అప్పు చేసి తమ కుమార్తె వివాహం జరిపించామని, అదనపు కట్నం తీసుకురావాలని తమ కుమార్తెను అల్లుడు యేడాదిగా హింసిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని తమ కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.